Prakash Raj: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు వినోద్ కుమార్, సామాజిక, రాజకీయ అంశాలపై స్పందిస్తూ ప్రకాష్ రాజ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ నటన పరంగా గొప్పవాడైనప్పటికీ, రాజకీయాల విషయానికి వస్తే ఆయన ఒక “వేస్ట్ పర్సన్” అని వినోద్ కొట్టిపారేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రకాష్ రాజ్ తరచూ విమర్శించడాన్ని వినోద్ కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. కోట్లాది మంది ప్రజల మద్దతుతో ఎన్నికైన ఒక దేశ ప్రధానిని గౌరవించకుండా, వ్యక్తిగత దూషణలకు దిగడం మూర్ఖత్వమని ఆయన అన్నారు. “మోదీ ఎక్కడ.. ప్రకాష్ రాజ్ ఎక్కడ?” అని ప్రశ్నిస్తూ, ప్రధాని తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం వంటి నిర్ణయాలను ఆయన సమర్థించారు. కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో శాంతి నెలకొల్పిన మోదీని విమర్శించే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు.
Read also-Brahmamudi Serial Today February 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్: పాపను చంపేందుకు రుద్రాణి ప్లాన్
ప్రకాష్ రాజ్కు వస్తున్న పాపులారిటీ వెనుక ఉన్న అసలు కారణాన్ని వినోద్ విశ్లేషించారు. ఆయన కేవలం తన నటన వల్ల మాత్రమే కాకుండా, పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలు చేయడం వల్లే అంతటి గుర్తింపు లభించిందని అన్నారు. సినిమా వేరు, నిజ జీవితం వేరు అని గ్రహించకుండా ప్రకాష్ రాజ్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రకాష్ రాజ్ గతంలో బెంగళూరులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడాన్ని వినోద్ ప్రస్తావించారు. ప్రజలకు కేవలం స్టేట్మెంట్లు ఇచ్చే వారంటే నమ్మకం ఉండదని, అందుకే వారు ఆయన్ని ఓడించారని చెప్పారు. అలాగే, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికల్లో కూడా ఆయన ఓటమికి ఆయన ప్రవర్తన, మాట తీరే కారణమని వినోద్ విశ్లేషించారు. మంచి వ్యక్తిత్వం లేని వారికి ప్రజల మద్దతు లభించదని ఆయన అభిప్రాయపడ్డారు.
Read also-Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకు ప్రభాస్ హీరోయిన్.. రెండో సినిమాకే?
ప్రకాష్ రాజ్ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడటం వెనుక ఆయన నేపథ్యం ఉందని వినోద్ వ్యాఖ్యానించారు. ప్రకాష్ రాజ్ ప్రాథమికంగా క్రైస్తవుడు కావడం వల్లే హిందూ ధర్మం పట్ల లేదా సనాతన ధర్మం పట్ల ఆయనకు అవగాహన లేదని, అందుకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వినోద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ ఒక గొప్ప నటుడిగా ఉండొచ్చు కానీ, రాజకీయ నాయకుడిగా లేదా సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగా ఆయన పూర్తిగా విఫలమయ్యారని వినోద్ కుమార్ ఈ ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.