Tollywood:రోజు రోజుకి నిత్యావసర సరుకులు ధరలు ఎలా అయితే ఆకాశాన్ని అంటుతున్నాయో అటు టికెట్ ధరలు కూడా ప్రేక్షకుడికి భారంగా మారుతున్నాయి.ఇష్టమైన అభిమాన హీరో సినిమా చూడాలి అంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సిందే. ఇక ఒంటరిగా సినిమా చూడలేని పరిస్థితి.. ఫ్యామిలీని తీసుకెళ్తే భరించలేని ఖర్చు.. దీంతో సినిమా చూడాలనే కోరికలను కూడా చంపేసుకుంటూ ఇంటికే పరిమితమవుతున్నారు సామాన్య ప్రేక్షకులు. అలాంటి వారందరికీ ఒక చక్కటి శుభవార్త అనే చెప్పాలి. ముఖ్యంగా ప్రతిరోజు మల్టీప్లెక్స్ ఏసీ గదుల్లో సినిమా చూస్తూ విసిగిపోయిన వారికి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించడమే కాకుండా ఉచితంగా సినిమా చూపిస్తాం అంటూ ఒక వేదిక సిద్ధమయ్యింది. పచ్చని ప్రకృతి ఒడిలో… ఆకాశం కింద సినిమా చూసే ఓపెన్ ఎయిర్ థియేటర్ అనుభవం ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. అది ఎక్కడో ఎవరికో తెలిస్తే మాత్రం ఎగిరిగంతేస్తారు.
అది మరి ఎక్కడో కాదు.. హైదరాబాద్ నగర వాసులకే ఈ అద్భుతమైన శుభవార్త. మల్టీప్లెక్స్ ల ఏసీ గదుల్లో సినిమా చూసి బోర్ కొట్టే రొటీన్ కి చెక్ పెడుతూ.. పచ్చని ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఓపెన్ ఎయిర్ థియేటర్ అనుభవాన్ని మళ్లీ మన ముందుకు తీసుకురాబోతోంది లలిత కళాతోరణం. నాంపల్లిలోని చారిత్రక పబ్లిక్ గార్డెన్స్ లో ఉన్న లలిత కళాతోరణం ఇందుకు వేదిక కాబోతోంది. నగర ప్రజలకు ఉచితంగా వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పర్యాటకశాఖ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఓటీటీలు, మొబైల్ ఫోన్ ల కాలంలో పాతకాలపు ఓపెన్ ఎయిర్ సినిమా సంస్కృతిని మళ్లీ నేటి తరానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ముందుకు రాబోతున్నారు.. ఇందుకోసం లలిత కళా తోరణంలో భారీ ఎల్ఈడి స్క్రీన్ ను, అధునాతన సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక ప్రదర్శనలు ప్రారంభమవుతాయి.
ఇకపోతే ఇక్కడ ఉచితంగానే సినిమా చూసే అవకాశం లభిస్తోంది. టికెట్ల గోల, క్యూ లైన్ లో ఇబ్బంది లేకుండా నేరుగా పబ్లిక్ గార్డెన్స్ కి చేరుకొని ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో సినిమాలను ఎంజాయ్ చేసే వీలు కల్పిస్తున్నారు. వీకెండ్ సమయంలో మాల్స్ కి వెళ్లడం కంటే ఇలా అందరితో కలిసి వినూత్నంగా సినిమా చూడం ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. కళాభిమానులు, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ALSO READ:ఓటీటీలోకి వచ్చేసిన ఉస్తాద్.. ట్రోలింగ్ తప్పేలా లేదే!
ఇకపోతే ఈ లలిత కళాతోరణంలో ప్రదర్శించే సినిమాల విషయానికి వస్తే.. ఏప్రిల్ 15వ తేదీన అనగా నిన్న కోర్ట్ సినిమాను ప్రదర్శించారు. నేడు తండేల్ సినిమాను ప్రదర్శించనున్నారు.. ఏప్రిల్ 17న బలగం.. ( తెలంగాణ పల్లె సంస్కృతిని, కుటుంబ బంధాలను భావోద్వేగంగా చూపించిన అవార్డు విన్నింగ్ చిత్రం ఇది. ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించే ఈ సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి చూడడం ఒక గొప్ప అనుభూతి).. ఇక ఏప్రిల్ 18న జనతా గ్యారేజ్ (పర్యావరణ పరిరక్షణ అనే సందేశం తో పాటు కమర్షియల్ హంగులు ఉన్న ఈ సినిమాని ఏప్రిల్ 18వ తేదీన ప్రదర్శించనున్నారు. ఇందులో ఎన్టీఆర్ మోహన్ లాల్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.)