Odisha Accident: సంతోషంగా సాగిన పెళ్లి వేడుకల్లో నవ్వులు విరిసాయి.. కానీ, ఆ మరుసటి రోజే ఆ ఇళ్లలో తీవ్ర విషాదం అలముకుంది. వేడుకకు వెళ్లి ఆనందంగా తిరిగి వస్తున్న వారి ప్రయాణాన్ని విధి ప్రమాదం రూపంలో బలితీసుకుంది. ఒడిశాలోని దేంకానాల్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఓ దారుణ రోడ్డు ప్రమాదం ఐదు కుటుంబాల్లో ఆరని శోకాన్ని మిగిల్చింది.
చెరువులోకి దూసుకెళ్లిన వాహనం
దేంకానాల్ జిల్లా సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిషాపుటా వద్ద ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. బంగురిసింగి గ్రామానికి చెందిన కొందరు బుధవారం రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. వేడుక ముగించుకుని గురువారం తెల్లవారుజామున కారులో స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో మహిషాపుటా సమీపానికి రాగానే వాహనం ఒక్కసారిగా అదుపు తప్పింది. వేగంగా వెళ్తూ రహదారి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది.
గ్రామస్థుల ప్రయత్నం..
ప్రమాదాన్ని గమనించిన స్థానిక గ్రామస్థులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆలస్యం చేయకుండా ఒక క్రేన్ను తీసుకొచ్చి, దాని సాయంతో నీటిలో మునిగిన కారును కష్టపడి బయటకు తీశారు. అయితే, అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. నీరు చేరడంతో కారులో ఉన్న ఏడుగురిలో ఐదుగురు ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో బయటపడిన ఇద్దరిని గ్రామస్థులు వెంటనే చికిత్స నిమిత్తం దేంకానాల్ ఆసుపత్రికి తరలించారు.
బంగురిసింగిలో మిన్నంటిన రోదనలు
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని బంగురిసింగి గ్రామానికి చెందిన చంద్రకాంత్ స్వయిన్, అవినాష్ సాహు, అభిషేక్ సాహు, రాకేశ్ సాహు, రామ్ సాహులుగా పోలీసులు గుర్తించారు. ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు ఒకేసారి మరణించడంతో బంగురిసింగి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read: తెలంగాణలో కొత్త లిఫ్ట్ చట్టం.. ఇకపై నాణ్యత లేకపోతే కంపెనీలపై కఠిన చర్యలు