Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టాలు, విధానాలు దేశంలోని గ్రామీణ పేదల జీవితాలను.. ప్రమాదంలోకి నెడుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ కల అయిన గ్రామ స్వరాజ్యానికి ప్రతీకగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA)ను పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రెండు విషయాల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒకటి మహాత్మా గాంధీ ఆలోచనలు, రెండవది పేదల హక్కులు అని స్పష్టం చేశారు. ఈ రెండు అంశాలకు జీవంత ఉదాహరణగా నిలిచే పథకం MNREGA అని చెప్పారు.
MGNREGA అనేది కేవలం ఉపాధి పథకం మాత్రమే కాదని, అది గ్రామ స్వరాజ్యానికి సజీవ రూపమని రాహుల్ పేర్కొన్నారు. లక్షలాది గ్రామీణ కుటుంబాలకు ఇది జీవనాధారంగా మారిందని, ముఖ్యంగా COVID-19 మహమ్మారి సమయంలో ఈ పథకం గ్రామీణ ప్రజలకు ఆర్థిక భద్రతా కవచంగా నిలిచిందని గుర్తు చేశారు. ఉపాధి లేక, ఆదాయం కోల్పోయిన సమయంలో MNREGA ద్వారా కోట్లాది కుటుంబాలు బతికాయని ఆయన అన్నారు.
అయితే, ప్రధాన మంత్రి మోడీ ఈ పథకం పట్ల ఎప్పటి నుంచో.. అసహనం వ్యక్తం చేస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. గత పదేళ్లుగా బడ్జెట్ కేటాయింపులు తగ్గించడం, పనిదినాలు కుదించడం, వేతనాల చెల్లింపులో ఆలస్యం చేయడం ద్వారా MNREGAను బలహీనపరచే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇప్పుడు ఈ పథకాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలనే లక్ష్యంతో కొత్త బిల్లును తీసుకురావాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు.
MGNREGA మూడు మూల సూత్రాలపై నిర్మించబడిందని రాహుల్ గాంధీ వివరించారు. మొదటిది ఉపాధి హక్కు – పని అడిగే ప్రతి గ్రామస్తుడికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు. రెండవది గ్రామ స్వయంప్రతిపత్తి – గ్రామం తన అవసరాలకు అనుగుణంగా పనులను నిర్ణయించుకునే స్వేచ్ఛ కలిగి ఉండటం. మూడవది కేంద్ర ప్రభుత్వ బాధ్యత – వేతనాల మొత్తం ఖర్చును, అలాగే సామాగ్రి ఖర్చులో 75 శాతం కేంద్ర ప్రభుత్వమే భరించడం.
కానీ మోదీ ప్రభుత్వం ఈ మౌలిక సూత్రాలన్నింటినీ తారుమారు చేయాలని చూస్తోందని రాహుల్ ఆరోపించారు. కొత్త బిల్లులో బడ్జెట్, ప్రణాళికలు, నియమాలు అన్నీ కేంద్ర ప్రభుత్వ చేతుల్లోనే కేంద్రీకరించాలనుకుంటోందని తెలిపారు. రాష్ట్రాలపై ఆర్థిక భారం పెంచుతూ ఖర్చులలో 40 శాతం భరించాల్సిందిగా నిబంధన విధించబోతున్నారని అన్నారు.
ఇదే కాకుండా, బడ్జెట్ గడువు ముగిసిన రెండు నెలల వరకూ, పంట కాలంలో గ్రామస్తులకు పని దొరకని పరిస్థితి తీసుకురావాలని చూస్తున్నారని రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. దీని వల్ల అత్యవసర సమయంలో ఉపాధి హక్కు నిర్వీర్యం అవుతుందని హెచ్చరించారు.
ఈ కొత్త బిల్లు మహాత్మా గాంధీ ఆదర్శాలను అవమానించడమే కాకుండా, గ్రామీణ పేదల జీవనోపాధిని పూర్తిగా దెబ్బతీసే విధంగా ఉందని రాహుల్ అన్నారు. ఇప్పటికే నిరుద్యోగ సమస్యతో భారతదేశ యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, ఇప్పుడు ఈ బిల్లు గ్రామీణ పేదల సురక్షిత జీవనాధారాన్ని కూడా తొలగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: సోనియా గాంధీ, రాహుల్కు భారీ ఊరట..! ఈడీకి షాకిచ్చిన ఢిల్లీ కోర్టు..
ఈ ప్రజా వ్యతిరేక బిల్లును కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. గ్రామాల వీధుల నుంచి పార్లమెంట్ వరకూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని, పేదల హక్కుల కోసం, మహాత్మా గాంధీ ఆలోచనల కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన ప్రకటించారు.