Raghav Chadha joins BJP: ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆప్ వ్యవస్థాపక సభ్యుడు, కీలక నేత రాఘవ్ చద్దాతో పాటు ఏడుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాఘవ్ చద్దా ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. రాజ్యసభలో ఆప్ కి ఉన్న మొత్తం 10 మంది సభ్యులలో మూడింట రెండొంతుల మంది (7 మంది) బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నామని, దీనికి సంబంధించిన లేఖను ఇప్పటికే రాజ్యసభ చైర్మన్కు అందజేశామని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రాఘవ్ చద్దా ఆప్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “నేను 15 ఏళ్ల జీవితాన్ని ఈ పార్టీ కోసం ధారపోశాను. అవినీతిపై పోరాటం చేస్తామని వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ, నేడు అదే అవినీతిలో కూరుకుపోయింది. నేటి ఆప్ పాత ఆప్ కాదు, అది పూర్తిగా రాజీపడిపోయింది.” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒక తప్పుడు పార్టీలో ఉన్న సరైన వ్యక్తిని అని, అందుకే రాజకీయాల నుండి తప్పుకోవడం కంటే, ప్రజలకు దగ్గరగా ఉండేందుకు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వివరించారు.
బీజేపీలో చేరుతున్న వారిలో రాఘవ్ చద్దాతో పాటు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, సందీప్ పాఠక్, విక్రమ్ సాహ్నీ, అశోక్ మిట్టల్, రాజిందర్ గుప్తా ఉన్నారు. 2/3 వంతు సభ్యులు ఒకేసారి పార్టీ మారుతుండటంతో, ఫిరాయింపుల నిరోధక చట్టం నుండి వీరికి వెసులుబాటు లభించే అవకాశం ఉంది. ఈ పరిణామం ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్కు కోలుకోలేని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్ని వారాల క్రితమే పార్టీలో చద్దా ప్రాధాన్యతను తగ్గించడం, ఆయనను కీలక పదవుల నుండి తప్పించడం వంటి పరిణామాలే ఈ తిరుగుబాటుకు కారణమని తెలుస్తోంది.
రాఘవ్ చద్దా చేరికతో బీజేపీకి రాజ్యసభలో బలం పెరగడమే కాకుండా, పంజాబ్, ఢిల్లీ రాజకీయాల్లో ఆ పార్టీకి కొత్త ఊపు రానుంది. విదేశాల్లో చికిత్స పొంది వచ్చినప్పటి నుండి చద్దా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు నేరుగా అధికార పార్టీలో చేరడమే కాకుండా, కేంద్ర మంత్రివర్గంలో ఆయనకు కీలక పదవి లభించే అవకాశం ఉందని సమాచారం. కేజ్రీవాల్కు అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న రాఘవ్ చద్దా ఇలా పార్టీని వీడటం ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది.
Read Also: ఇష్టం లేకుండా గర్భం.. 15 ఏళ్ల బాలిక కేసులో సుప్రీం సంచలన తీర్పు