Chennai: తమిళనాడులో రాజకీయాలు హాట్ హాట్గా సాగుతున్నాయి. టీవీకే పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే సమయంలో అన్నాడీఎంకే పార్టీ సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ నేతలు రెండు వర్గాలుగా చీలినట్టు వార్తలు జోరందుకున్నాయి. అంతేకాదు ఆ పార్టీకి చెందిన 36 మంది ఎమ్మెల్యే టీవీకే పార్టీతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ పార్టీలో ఏం జరుగుతోంది?
అన్నాడీఎంకెలో సంక్షోభం.. నేతల తిరుగుబాటు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకె ఈసారి మూడో స్థానానికి పడిపోయింది. గడిచిన నాలుగైదు రోజులుగా గెలిచిన ఎమ్మెల్యేలను కన్వీన్స్ చేసే ప్రయత్నం చేశారు మాజీ సీఎం పళనిస్వామి. శనివారం రాత్రి ఆ సంక్షోభం కాస్త తీవ్రమైంది. ఈ నేపథ్యంలో సుమారు 36 మంది ఎమ్మెల్యేలు మాజీ మంత్రి షణ్ముగం ఆఫీసులో సమావేశమయ్యారు.
పార్టీలో పరిస్థితులు, ఇతర అంశాలు, ఏఐఏడీఎంకే శాసనసభ పక్షానికి ఎవరు నాయకత్వం వహిస్తారు? అనేదానిపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అంతేకాదు 36 మంది ఎమ్మెల్యేలు ఓ గ్రూపుగా ఏర్పడినట్టు తెలుస్తోంది. అదే సమయంలో టీవీకే పార్టీ ముఖ్యనేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
టీవీకే పార్టీతో 35 మంది ఎమ్మెల్యేల చర్చలు
ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ ఎమ్మెల్యేలతో పలుమార్లు చర్చలు జరిపారు మాజీ సీఎం పళనిస్వామి. తాము అధికారంలోకి వస్తున్నామంటూ గెలిచిన ఎమ్మెల్యేలను ఆయన కన్వీన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే డీఎంకెలోని మిత్రులు టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడం, గవర్నర్కు లేఖ ఇవ్వడంతో వారి ఆశలు నీరుగారిపోయాయి.
ఆదివారం ప్రమాణ స్వీకారానికి టీవీకే పార్టీ సిద్ధమైంది. పరిస్థితి గమనించిన అన్నాడీఎంకెలోని 36 మంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నామని, ఇప్పుడైనా టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వకుంటే పార్టీకి కష్టాలు తప్పవని కొందరు నేతలు పళనిస్వామితో జరిగిన సమావేశంలో కుండబద్దలు కొట్టేశారట.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత షణ్ముగం వర్గం టీవీకే నేతలతో టచ్లోకి వెళ్లినట్టు సమాచారం. ఎన్డీయేలో అన్నాడీఎంకే భాగస్వామి కావడంతో వారితో కలిసేందుకు టీవీకే నో చెప్పిందట. అందుకే అన్నాడీఎంకే నుంచి బయటికి వచ్చి పుదుచ్చేరిలో క్యాంపు పెట్టిన విషయం తెల్సిందే. శాసనసభ పక్ష నాయకుడిగా పళనిస్వామి కొనసాగాలని కొందరు నాయకులు కోరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ALSO READ: తమిళ రాజకీయాల్లో సంచలనం.. 3 రోజులు డెడ్ లైన్
ఆ పదవి కోసం ఎస్పీ వేలుమణి, షణ్ముగం పోటీగా నిలిచారు. దీనిపై ఆ పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెన్నై వర్గాలు చెబుతున్నాయి. మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత ఏఐఏడీఎంకే అనేక సమస్యలను ఎదుర్కొంది. పళనిస్వామి వాటని అధిగమించి పార్టీ ప్రధాన కార్యదర్శిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపించ లేకపోవడంతో పళనిస్వామి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. మొత్తానికి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అన్నాడీఎంకె రెండు ముక్కలు కావడం ఖాయమని అంటున్నారు.