Vehicles: ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్న దేశాల్లో భారత్ ఒకటి. ప్రతీ ఏటా లక్షలాది మంది యువతీ యువకులు మృత్యువాత పడుతున్నారు. దీనికి రకరకాల కారణాలు లేకపోలేదు. అతి వేగంగా వెళ్లడమే కారణంగా నివేదికలు ప్రస్తావిస్తున్నాయి. వేగంగా వెళ్లే క్రమంలో వాహనాలు గుర్తించకపోవడంతో దారుణమైన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. వాహనాలు దానంతట అదే ముందు వెళ్తున్న వాహనాలను గుర్తించి వెనుక వచ్చే వాహనాన్ని అప్రమత్తం చేయనుంది. అలాంటి టెక్నాలజీ మన వాహనాల్లో త్వరలో రానుంది.
వాహనాల వేగం, దిశ వంటి వివరాలను సమీపంలో ఇతర వాహనాలతో పంచుకునేందుకు కొత్త టెక్నాలజీ వచ్చేసింది. ప్రస్తుతం అది పరీక్షల దిశలో ఉంది. అదే వెహికిల్ టు వెహికిల్- వీ2వీ కమ్యూనికేషన్ వ్యవస్థను దశల వారీగా అమల్లోకి తీసుకురానుంది కేంద్రం. అందుకోసం కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-1989కు సవరణలను ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించి తాజాగా ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి తయారయ్యే ఎల్, ఎం, ఎన్ కేటగిరీ (L,M,N) వాహనాల్లో వీ2వీ కమ్యూనికేషన్ వ్యవస్థ అమర్చనుంది. అది ఏఐఎస్-230 ప్రమాణాలకు లోబడి ఉండనుంది. 2028 అక్టోబరు ఒకటి నుంచి తయారయ్యే ఈ తరహా వాహనాలకు ఏఐఎస్-230 ప్రమాణాలకు అనుగుణంగా కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండనుంది. ఈ పద్దతిపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలను నెలరోజుల్లో పంపాలని కేంద్రం పేర్కొంది.
ప్రస్తుత వాహనాలు కేవలం సెన్సర్లు, డ్రైవర్ల స్పందనపై ఆధారపడి సంకేతాలు పంపుతోంది. వీ2వీ కమ్యూనికేషన్ కంటికి కనిపించకుండా ఇతర సమాచారాన్నీ ఇవ్వనుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సాంకేతికత సాయంతో వాహనాలు పరస్పరం మాట్లాడుకోవడం అన్నమాట. V2V టెక్నాలజీ అందుకు భిన్నంగా పని చేయనుంది. రేడియో సిగ్నల్స్ ద్వారా సమీపంలో ఇతర వాహనాలతో వేగం, దిశ వంటి వివరాలు నిరంతరం పంచుకుంటాయి. ముందు వెళ్తున్న వాహనం సడన్ బ్రేక్, ప్రమాదకరమైన మలుపులు, రాంగ్ రూట్ డ్రైవింగ్, ఎదురెదురుగా వచ్చే వాహనాల ఢీ కొనే ముప్పు, అత్యవసర వాహనాలు వచ్చినప్పుడు డ్రైవర్ల కంటికి కనిపించకపోయినా ఈ సిస్టమ్ గుర్తించనుంది. దానికి సంబంధించిన సమాచారం ద్వారా డ్రైవర్ను అలర్ట్ చేయనుంది.
దీనివల్ల ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ యాక్టివేట్ కానుంది. ఈ టెక్నాలజీ ఫ్రీక్వెన్సీ బ్యాండ్పై పని చేయనుంది. ఈ ఏడాది జూన్ 10న టెలికాం శాఖ ఈ తరహా స్పెక్ట్రమ్కు లైసెన్స్ మినహాయింపు ఇచ్చింది. వీ టువీ కమ్యూనికేషన్ అమల్లోకి వస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గవచ్చని రోడ్డు భద్రతా నిపుణులు చెబుతున్నారు. సాంకేతిక నిపుణుల ప్రకారం.. వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థ సైబర్ దాడులు, డేటా దొంగతనం, లొకేషన్ ట్రాకింగ్ వంటి సవాళ్లు లేకపోలేదు. ఈ కారణంగా సాంకేతికత అమలు చేసినప్పుడు పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ చర్యలు, డేటా పరిరక్షణ ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలని చెబుతున్నారు.
ALSO READ: పీకే గెలుపుతో బీహార్ రాజకీయాలు కొత్త మలుపు..బీజేపీలో నిశ్శబ్దం, నితీష్ ఎంట్రీ?