Bihar Bypoll: ప్రశాంత్ కిషోర్ గెలుపుతో బీహార్లో రాజకీయాలు మారనున్నాయా? బీహార్ సీఎంను టార్గెట్ చేసి బీజేపీని ఇరకాటంలోకి పీకే నెట్టేశారా? జరుగుతున్న పరిణామాలు బీజేపీకి మింగుడుపడడం లేదా? పీకే ఎదుర్కోవాలంటే నితీష్కుమార్ మళ్లీ వెనక్కి రప్పించే ఛాన్స్ వుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
బీహార్లోని బంకిపూర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో విజయం ద్వారా తాను ఎన్నికల వ్యూహకర్త కాదని నిరూపించుకున్నాడు ప్రశాంత్ కిషోర్. ప్రజల విశ్వాసాన్ని గెలిపించగల సమర్థుడని నిరూపించుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీపై కనిపించని అస్త్రాలు ఎక్కుపెట్టారు పీకే. దీనికితోడు నీట్ ఆందోళనలు కూడా ఆయనకు కలిసి వచ్చాయి. దీంతో రావాల్సిన ఫలితం వచ్చేసింది. మూడు దశాబ్దాలుగా బంకీపూర్ సీటు బీజేపీకి కంచుకోట. ఈ స్థానం నుంచి బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ గెలుపు పొందుతూ వచ్చారు. ఏకంగా నాలుగు సార్లు ఆయన గెలిచారు. నితిన్ రాజ్యసభకు వెళ్లిన తర్వాత ఆ సీటు ఖాళీ కావడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అందుకే ఈ ఎన్నిక బీజేపీ ప్రతిష్టతో ముడిపడింది. స్వయంగా బీజేపీ అధ్యక్షుడు ఇంటింటికి ప్రచారం చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి పగ్గాలు చేపట్టిన తర్వాత బీజేపీ చవి చూసిన మొదటి ఓటమి. నితీష్ కుమార్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే పీకే అంచనాలు ఎవరికీ అందవు. ఆ విషయాన్ని బీజేపీ ఎప్పుడో గమనించి, ఆయన్ని దూరంగా పెట్టింది. పీకే గెలుపు బీహార్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం కనిపించింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ.. బీజేపీ-జన్ సూరజ్ పార్టీల మధ్య విజయావకాశాల క్రమంగా పెరుగుతూ వచ్చింది. బీజేపీ కార్యకర్తలు ఎంత నమ్మకంగా ఉన్నారంటే ఓట్ల లెక్కింపు ప్రారంభం కాకముందే విజయోత్సవాలు జరుపుకోవడానికి లడ్డూలను సిద్ధం చేశారు.
పీకే విజయాన్ని చాలా మంది రాజకీయ విశ్లేషకులు జన సూరజ్ ప్రచారానికి-ప్రజల స్పందన, స్థానిక సమస్యలు,ఆ రాష్ట్ర ప్రభుత్వ పని తీరుకు ముడిపెడుతున్నారు. జనసూరజ్ పార్టీకి విజయం మాత్రమే కాదు.. ప్రశాంత్ కిషోర్ రాజకీయ జీవితంలో తొలి ఎన్నికల విజయం. దేశంలో ఎంతో మంది నాయకులకు ఎన్నికల వ్యూహాకర్తగా పని చేశారు ఆయన. ప్రధాని మోదీ నుండి మొదలు.. బెంగాల్ మమతా బెనర్జీ, తమిళనాడు స్టాలిన్, ఆ తర్వాత విజయ్, ఏపీలో జగన్ వరకు అనేక మంది నాయకులకు ఎన్నికల ప్రచారంలో ఆయన పాత్ర అంతాఇంతా కాదు.
2024లో జన సూరజ్ పార్టీని స్థాపించారు ప్రశాంత్ కిషోర్. ఆ తర్వాత 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసింది. కానీ ఒక్క సీటు కూడా గెలుచు కోలేకపోయింది. ఆ ఓటమి తర్వాత పీకే వ్యూహం కేవలం సలహాలకే పరిమితమా? ఎన్నికల సంగ్రామంలో విజయం సాధించగలరా? అంటూ రాజకీయ విశ్లేషకులు ప్రశ్నించారు. కానీ బంకీపూర్ బైపోల్ విజయం ఈ అభిప్రాయాన్ని చాలావరకు మార్చేసింది. ప్రచారంలో నేరుగా సీఎంని టార్గెట్ చేశారంటూ పీకే వ్యూహం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విజయంతో బీహార్లో జనతాదల్-ఆర్జేడీ పార్టీలకు కొత్త వ్యక్తి ఎవరంటే పీకే పేరు బలంగా వినిపిస్తోంది. ఈ ఎన్నికతో ఆ రాష్ట్రమంతా ఆయనకు బోలెడంత ప్రచారం వచ్చింది.
ఈ ఎన్నికతో బీహార్ రాజకీయ పరిస్థితి క్రమంగా మారే ఛాన్స్ వుంది. ఎన్నికల ప్రచారంలో ఈ ఎన్నిక కేవలం ఒక అసెంబ్లీ సీటుకు సంబంధించినది కాదని, బీహార్ కొత్త రాజకీయ రూపురేఖల ఆరంభానికి నాంది అని ప్రశాంత్ కిషోర్ నిరంతరం సందేశం ఇవ్వడానికి ప్రయత్నించారు. తన ప్రసంగాల్లో సీఎం సమ్రాట్ చౌదరిని పదే పదే లక్ష్యంగా చేసుకుంటూ వచ్చారు. బంకీపూర్లో బీజేపీ ఓడిపోవడంతో దాని సందేశం కేవలం బీహార్కు మాత్రమే కాదు దేశమంతా ప్రతిధ్వనించింది. ఈ విజయం జాతీయ స్థాయిలో అత్యంత చర్చనీయాంశమైన ఎన్నికగా నిలిచింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి ఉండటానికి కేవలం రెండు రాష్ట్రాలు కారణం. అందులో ఒకటి యూపీ కాగా, మరొకటి బీహార్. తాజా ఓటమితో నితీష్ కుమార్ను వెనక్కి పంపిస్తే బెటరన్న మాటలు బీజేపీ నేతల్లో బలంగా వినిపిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న దగ్గర వారికే ఛాన్స్ ఇవ్వకుంటే కొత్తగా జనసూరజ్ లాంటి పార్టీలు పుట్టుకొచ్చే అవకాశముందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ALSO READ: ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్పై కేజ్రీవాల్ సమరం