![Arvind Kejriwal-Kingpin In Delhi Liquor Scam Says ED](https://www.bigtvlive.com/wp-content/uploads/2024/03/AAP-I.jpg)
CM Arvind Kejriwal is Kingpin in Delhi Liquor Scam Said by ED: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలకసూత్రధారి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) శుక్రవారం ఢిల్లీ కోర్టుకు తెలిపింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ‘స్కామ్’ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ను 10 రోజుల కస్టడీకి కోరింది.
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో గురువారం అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ను శుక్రవారం న్యూఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 ఏర్పాటులో కేజ్రీవాల్ ప్రత్యక్షంగా పాల్గొన్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రూస్ అవెన్యూ కోర్టు ముందు సమర్పించింది. కాగా ఈ లిక్కర్ పాలసీని గత సంవత్సరం రద్దు చేశారు.
“ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర మంత్రులు, నాయకులతో పాటు మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ కీలక కుట్రదారు” అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలిపింది.
Also Read: Delhi Liquor Policy Case: ఢిల్లీ మద్యం కుంభకోణం.. అసలేం జరిగింది? లెక్కలివే..!
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేసినందుకు అరవింద్ కేజ్రీవాల్ ‘సౌత్ గ్రూప్’ నుంచి అనేక కోట్ల రూపాయలు అందుకున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. మద్యం కుంభకోణంలో ‘సౌత్ గ్రూప్’, ఇతర నిందితుల మధ్య కేజ్రీవాల్ “మధ్యస్థుడిగా” వ్యవహరించారని ఏజెన్సీ పేర్కొంది.
“పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సౌత్ గ్రూప్కి చెందిన కొంతమంది నిందితుల నుంచి అతను ₹100 కోట్లు డిమాండ్ చేశారు” అని ఏజెన్సీ తరపున హాజరయిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎస్వీ రాజు చెప్పినట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.
గోవా ఎన్నికలలో ఉపయోగించిన ₹45 కోట్లు.. నాలుగు హవాలా మార్గాల నుంచి వచ్చినట్లు మనీ ట్రయల్ చూపించిందని లా ఆఫీసర్ కోర్టుకు తెలిపారు. నిందితులు, సాక్షుల వాంగ్మూలాలు కాల్ డీటైల్ రికార్డుల (సీడీఆర్) ద్వారా ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు ఈడీ తెలిపింది
ఏఎస్జీ రాజు మాట్లాడుతూ ఆప్ అనేది ఒక వ్యక్తి కాదని, సంస్థ అని, సంస్థ నిర్వహణకు బాధ్యత వహించే ప్రతి వ్యక్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.