![VIZAG DRUGS SEIZED BY CBI CASE POLITICAL CONTROVERSY ON YSRCP ON TDP BJP](https://www.bigtvlive.com/wp-content/uploads/2024/03/VIZAG-PORT-DRUGS-CONTAINER-SEIZED-BY-CBI-ON-OPERATION-GARUDA.jpg)
Vizag Drugs Case: విశాఖ డ్రగ్స్ వ్యవహారంపై రాజకీయ రంగు పులుముకుంది. దీనిపై అధికార-విపక్షాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. డ్రగ్స్ విషయంలో బీజేపీ-టీడీపీ నేతల పాత్ర ఉందని అనుమానం వ్యక్తంచేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ. నేతలు తప్పించుకోవడానికే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యంగా పురందేశ్వరి బంధువులకు ఆయా కంపెనీలతో సంబంధాలున్నాయన్నారు. ఈ వ్యవహారంపై కావాలనే తమపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చాలని సీబీఐకి లేఖ రాస్తామన్నారు సజ్జల.
సజ్జల వ్యాఖ్యలపై బీజేపీ కౌంటరిచ్చింది. మాదక ద్రవ్యాల అంశం యావత్ దేశాన్ని కుదిపేసిందన్నారు బీజేపీ నేత యామినీశర్మ. పోలీసులు, నార్కోటిక్ విభాగాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. కూనం వీరభద్రరావుకు చెందిన ఆక్వా ప్రైవేటు సంస్థ పేరుతో విశాఖకు కంటెయినర్ వచ్చిందన్నారు. అతడు వైసీపీ నేత సోదరుడని చెప్పారు. ఇదంతా కప్పిపుచ్చుకోవడానికి పురందేశ్వరిపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ తరహా ఆరోపణలు మానుకోకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు డ్రగ్స్ వ్యహారంపై ఎంపీ రఘురామకృష్ణరాజు నోరు విప్పారు. తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనన్నారు. సంధ్య ఆక్వా కంపెనీకి చెందిన కంటైనర్ లో డ్రగ్స్ దొరికాయని చెప్పిన ఆయన, డాక్టర్ కె.వి. ప్రసాద్, కూనం వీరభద్రరావు కలిసి ఆ సంస్థను స్థాపించారని గుర్తు చేశారు. దాదాపు 25 వేల కిలోల డ్రగ్స్ సీజ్ చేయడం ముమ్మాటికీ షాకింగ్ అని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. డ్రగ్స్ స్వాధీనం విషయంలో పోలీసులు, పోర్టు అధికారులు సహకరించడపోవడాన్ని తప్పుబట్టారు. దీని వెనుక వైసీపీ ప్రమేయమున్నట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోసమే వైసీపీ డ్రగ్స్ తీసుకొచ్చినట్టు ఉందని మండిపడ్డారు. డ్రగ్స్ కేపిటల్ గా ఏపీ మారిపోయిందని విచారం వ్యక్తంచేశారు. ఇందుకు కారణమైన వాళ్లని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.
Also Read: TDP Workshop Candidates:ఛాన్స్ ఇవ్వొద్దు.. వదలొద్దు.. అభ్యర్థులకు చంద్రబాబు కీలక సూచనలు
అటు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి కూడా రియాక్ట్ అయ్యారు. ఇదేనా మీ ప్రభుత్వమని మండిపడ్డారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ కి అడ్డాగా ప్రభుత్వం మార్చిందని సోషల్ మీడియా వేదికగా దుయ్యబట్టారు. అటు జనసేన పార్టీ కూడా తనదైన శైలిలో స్పందించింది. ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు మన రాష్ట్రంలోనే ఉండటం సిగ్గు చేటన్నారు పవన్. గుజరాత్ లో డ్రగ్స్ దొరికినప్పుడు దాని మూలాలు విజయవాడలోని ఆషి ట్రేడర్స్ పేరు మీద తేలిందని గుర్తు చేశారు. ఇప్పుడు వైజాగ్ పోర్టులో దొరికిన డ్రగ్స్ ఆందోళన కలిగిస్తుందన్నారు. కేంద్ర నిఘా సంస్థలు డ్రగ్స్ రాకెట్ చేధించేందుకు చేపట్టిన ఆపరేషన్ గరుడను మరింత లోతుగా విచారణ చేసి ఏపీ డ్రగ్స్ మాఫియాను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మొత్తానికి ఎన్నికల వేళ ఈ కేసు రాజకీయ వివాదంగా మారింది.