Arvind Kejriwal: E20 పెట్రోల్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశరాజధానిలో వాహనదారుల ప్రయోజనాలను కాపాడాలంటూ ఆయన నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ నివాస ముట్టడికి పిలుపునివ్వడంతో ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
2 లక్షల సంతకాలతో ప్రధాని ఇంటికి…
మధ్యాహ్నం 12 గంటలకు దాదాపు 100 మంది మద్దతుదారులతో కలిసి కేజ్రీవాల్ ప్రధాని నివాసం వైపు పాదయాత్రగా వెళ్లనున్నారు. ఈ20 పెట్రోల్ వాడకంపై ప్రజల్లో ఉన్న తీవ్ర అభ్యంతరాలను తెలియజేస్తూ.. 2 లక్షలకు పైగా సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధానికి అందజేయనున్నారు. అసలు E20 పెట్రోల్ వాడకంపై ప్రభుత్వం చేపట్టిన పూర్తి స్టడీ రిపోర్టును వెంటనే ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.
పాత వాహనదారులకు తీరని నష్టం!
ప్రస్తుతం విస్తృతంగా జరుగుతున్న E20 పెట్రోల్ ప్రచారాన్ని కేజ్రీవాల్ తీవ్రంగా ప్రశ్నించారు. వాహన ఇంజన్లకు సరిపోని ఇంధనాన్ని బలవంతంగా వాడాల్సి వస్తే పాత వాహనాల యజమానులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి పెట్రోల్ బంకులో వినియోగదారుడికి నచ్చిన ఇంధనాన్ని ఎంచుకునే వెసులుబాటు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.
కార్పొరేట్ లాభాల కోసమేనా?
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు ఆయన కుమారులకు వ్యాపార రీత్యా మేలు చేసేందుకే ఈ ఇథనాల్ బ్లెండింగ్ను తీసుకొచ్చారని కేజ్రీవాల్ సంచలన ఆరోపణ చేశారు. ప్యూర్ పెట్రోల్తో పోలిస్తే E20 పెట్రోల్ తయారీ ఖర్చు తక్కువ కాబట్టి, దాని ధరను సాధారణ పెట్రోల్ కంటే చాలా తక్కువగా విక్రయించాలని అన్నారు. లీటర్ పెట్రోల్ ధరను రూ. 84కి తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
Also Read: నాగర్కర్నూల్లో నకిలీ ఎరువుల కలకలం.. 872 సంచులు స్వాధీనం, 7 గురు అరెస్ట్!