Surya Tilak: అయోధ్యలోని రామమందిరంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రాణప్రతిష్ట తర్వాత వచ్చిన ఈ విశిష్ట పర్వదినాన బాలరాముడి దర్శనం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ‘సూర్య తిలకం’. అయితే మధ్యాహ్నం సరిగ్గా అభిజిత్ లగ్నంలో సూర్యకిరణాలు నేరుగా బాలరాముడి నుదుటిపై ప్రసరించి, దివ్యమైన కాంతిలో స్వామివారిని వెలిగించి భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి.
ఈ అద్భుత దృశ్యం వెనుక భారతీయ శాస్త్రవేత్తల మేధస్సు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దాగి ఉన్నాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA), రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CBRI) శాస్త్రవేత్తలు కలిసి ఈ ఆప్టో-మెకానికల్ వ్యవస్థను రూపొందించారు. ఎటువంటి విద్యుత్తు లేదా బ్యాటరీల అవసరం లేకుండా, కేవలం అద్దాలు మరియ, కటకాల సాయంతో సూర్యకాంతిని గర్భగుడిలోకి ప్రసరింపజేయడం దీని ప్రత్యేకత.
ఈ ప్రక్రియ కోసం ఆలయ మూడో అంతస్తులో ఒక ప్రత్యేక పరికరాన్ని అమర్చారు. అక్కడి నుంచి సూర్యకిరణాలను గ్రహించి, నాలుగు అద్దాలు, నాలుగు కటకాల (Lenses) ద్వారా కాంతిని మళ్లిస్తూ గర్భగుడిలోని విగ్రహం వరకు చేర్చారు. సుమారు 58 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండే ఈ కాంతి తిలకం, స్వామివారి నుదుటిపై దాదాపు మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ప్రకాశిస్తుంది. పరిమిత సంఖ్యలో పైపులను వాడుతూ, కాంతి తీవ్రత తగ్గకుండా ఈ వ్యవస్థను అత్యంత కచ్చితత్వంతో నిర్మించారు.
ప్రతి ఏటా తిథి ప్రకారం వచ్చే శ్రీరామనవమి రోజున సూర్యుడి స్థానం మారుతూ ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని శాస్త్రవేత్తలు గేర్ టీత్ మెకానిజంను ఉపయోగించారు. ఇది గడియారంలోని ముల్లులు తిరిగే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. సూర్యకాంతిని గ్రహించే అద్దాన్ని ఈ గేర్ వ్యవస్థ ప్రతిరోజూ స్వల్పంగా కదిలిస్తూ ఉంటుంది. దీనివల్ల చంద్రమాన క్యాలెండర్ ప్రకారం వచ్చే తదుపరి శ్రీరామనవమి నాటికి, అద్దం ఖచ్చితమైన కోణంలోకి వచ్చి మళ్లీ సూర్య తిలకాన్ని ఆవిష్కరిస్తుంది.
Also Read: కుటుంబ సమేతంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రులని దర్శించుకున్న సీఎం
ఈ వినూత్న ప్రయోగం ఆధ్యాత్మికతకు, విజ్ఞాన శాస్త్రానికి మధ్య ఉన్న విడదీయలేని బంధానికి నిదర్శనంగా నిలిచింది. పురాతన భారతీయ ఖగోళ శాస్త్రాన్ని, ఆధునిక ఇంజనీరింగ్ను మేళవించి రూపొందించిన ఈ సూర్య తిలకం, రాబోయే వందలాది ఏళ్లపాటు ప్రతి శ్రీరామనవమి రోజున బాలరాముడిని సూర్యకిరణాలతో అభిషేకించనుంది. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు తమ జన్మ ధన్యమైందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయోధ్య బాలరాముడి విగ్రహ నుదుటిపై సూర్యకిరణాలతో తిలకం దిద్దే అద్భుత దృశ్యం
The magnificent spectacle of the sun's rays adorning the forehead of the idol of Balaram in Ayodhya with a Tilak. pic.twitter.com/C0S4BCS8OQ— BIG TV Breaking News (@bigtvtelugu) March 27, 2026