Ayodhya: విరాళాల దుర్వినియోగం వ్యవహారం అయోధ్య ట్రస్టును ఓ కుదుపు కుదిపేసింది. ఈ కేసులో ఇంకా దర్యాప్తు జరుగుతుండగా ట్రస్టు మరొక కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చేసిన రాజీనామాను ఆమోదించింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్ నియమించింది. ఎవరీ కృష్ణమోహన్?
అయోధ్య ట్రస్టులో కీలక మార్పులు: ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని శ్రీరామ మందిరంలో విరాళాల స్కామ్ వ్యవహారం నేపథ్యంలో ట్రస్టు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాల రాజీనామాలను శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆమోదించింది. సోమవారం అయోధ్యలో జరిగిన సమావేశంలో ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకుంది.
దాదాపు మూడు గంటలపాటు సమావేశం జరిగింది. ట్రస్టు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్ నియమించింది. అంతేకాదు ట్రస్టుకు కొత్తగా సీఈవోను నియమించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. సోమవారం అయోధ్యలో ట్రస్టు సమావేశం జరిగింది. శాశ్వత సభ్యుల్లో తొమ్మిది మందికి గాను ఏడుగురు హాజరయ్యారు.
తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్: ట్రస్టు ఛైర్మన్ నృత్య గోపాల్దాస్ హాజరయ్యారు. చంపత్రాయ్, అనిల్ మిశ్రాలు ఈ భేటీకి దూరంగా ఉన్నారు. వీరిద్దరి రాజీనామాలను ఆమోదించామని తెలిపింది. కృష్ణ మోహన్కు తాత్కాలిక ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించింది. ఉత్తర్ ప్రదేశ్లోని హర్దోయ్కు చెందిన కృష్ణ మోహన్ ప్రస్తుతం ట్రస్టు శాశ్వత సభ్యుడిగా ఉన్నారు. ఆయన వయసు 73 ఏళ్లు.
ఆరెస్సెస్ సీనియర్ సభ్యుడు, ఇండియన్ ఫారెస్టు సర్వీస్ మాజీ అధికారి. గతేడాది సెప్టెంబరులో ట్రస్టు శాశ్వతసభ్యుడిగా చేరారు. లక్నో విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా అందుకున్న ఆయన, అణు శక్తి విభాగంలో సేవలందించారు. ఆ తర్వాత మహారాష్ట్ర క్యాడర్ ఐఎఫ్ఎస్గా బాధ్యతలు చేపట్టిన విషయం తెల్సిందే.
ALSO READ: భారీ వర్షాలకు మహారాష్ట్ర అతులాకుతలం.. విరిగిన కొండచరియలు, ముంబై-పుణే మధ్య వాహనాలు నిలిపివేత
విరాళాల స్కామ్ నివేదిక ఈనెల 22 లోపు వచ్చే అవకాశం: ట్రస్టు మరోసారి ఈనెల 22 సమావేశం కానుంది. అప్పటికి సిట్ తుది నివేదిక వస్తుందని భావిస్తోంది. విరాళాల స్కామ్కు చంపత్ రాయ్ కేంద్ర బిందువుగా ఉన్నారు సిట్ అరెస్టు చేసిన ఎనిమిది మందిలో ఆయన సన్నిహితుడు రామశంకర్ అలియాస్ తిన్ను యాదవ్ ఉన్నాడు. రాయ్తో పాటు మిశ్రాను సిట్ విచారించింది. ఇప్పటివరకు ఆయనపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.