Ayush Ministry: వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై ఇటీవల సుప్రీంకోర్టు పతంజలిపై సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశంలోని ఆయుర్వేద ఔషధ తయారీదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి మందుల తయారీదారులు తమ ఉత్పత్తుల ప్రకటనల్లో కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని హెచ్చరించింది.
లేబులింగ్ విషయంలోనూ ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అంతే కాకుండా అన్ని రాష్ట్రాల్లో మందుల లేబుల్లు పరిశీలించాలని రాష్ట్ర డ్రగ్ లైసెన్సింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఔషధ తయారీదారుల ప్రకటనలను కూడా పరిశీలించాలని తెలిపింది.
ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా ఆమోదించబడిన మందుల లేబుల్లను తనిఖీ చేసి నిర్ధారించాలని అధికారులకు మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లోని ఏ ప్లాట్ఫారమ్లో అయినా వినియోగదారులను తప్పుదారి పట్టించే ప్రకటన ఉంటే..ఆయా ఔషధ తయారీదారులు చట్టపరమైన చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని తెలిపింది.
Also Read: త్వరలో..ఆహార వస్తువుల ధరల తగ్గుదల: ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఇటీవల యోగా గురువు రామ్దేవ్, పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ బాలకృష్ణకు చెందిన ఉత్పత్తుల ప్రకటనలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయంటూ పలు ఆరోపణలు రావడంతో పతంజలిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అలర్ట్ అయిన ఆయుష్ మంత్రిత్వ శాఖ ఔషధ తయారీదారులకు పలు హెచ్చరికలు జారీ చేసింది.