Mamata Banerjee On Ajit Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూశారు. ఈ ఘటన రాజకీయ మలుపు తీసుకుంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమాన ప్రమాదంలో కుట్ర కోణం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనను కేవలం ప్రమాదంగా కొట్టిపారేయలేమన్నారు. ఉన్నత స్థాయి దర్యాప్తునకు మమతా డిమాండ్ చేశారు.
“అజిత్ పవార్ మరణంపై సరైన దర్యాప్తు జరగాలి. దర్యాప్తును సుప్రీంకోర్టు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి” అని మమతా బెనర్జీ కోరారు. పవార్ మహాయుతి కూటమి నుంచి దూరం జరుగుతున్న సంకేతాలు కూడా ఇచ్చారమని ఆమెచెప్పారు. “అజిత్ పవార్ అధికార పార్టీతో ఉన్నారు. కానీ ఆయన బీజేపీ కూటమిని విడిచిపెడతారని వార్తలు వచ్చాయి. అటువంటి పరిస్థితులలో ఈ ప్రమాదం అనుమానాస్పదంగా ఉంది” అని మమతా బెనర్జీ అన్నారు.
అజిత్ పవార్ మరణ వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మమతా బెనర్జీ అన్నారు. కొన్ని రోజుల క్రితం మరొక పార్టీకి చెందిన నేత అజిత్ పవార్ బీజేపీని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారన్నారు. ఇప్పుడు ఈ సంఘటన తర్వాత, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సరైన దర్యాప్తు జరగాలని తాను డిమాండ్ చేస్తున్నానన్నారు. తాము సుప్రీంకోర్టును మాత్రమే నమ్ముతామన్నారు. మరే ఇతర సంస్థను విశ్వసించమని సీఎం మమతా బెనర్జీ చెప్పారు. ఈ ప్రమాదం దేశంలోని రాజకీయ నాయకుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతుందన్నారు.
పవార్ విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలని పలువురు రాజకీయ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్లు సోషల్ మీడియా వేదికగా పవార్ మృతికి సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంపై పారదర్శకమైన దర్యాప్తు చేయాలని కోరారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (66) బుధవారం బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. పూణే జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల ప్రచారానికి పవన్.. ఒక ప్రైవేట్ విమానంలో బారామతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ విమానం ఉదయం 8 గంటల సమయంలో ముంబై నుంచి బయలుదేరింది. ల్యాండింగ్ కోసం బారామతి ఎయిర్ పోర్టును సమీపిస్తుండగా…ఒక్కసారిగా కూలిపోయింది. విమానం కూలిపోగానే భారీ పేలుడు సంభవించింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు మరణించారు.
Also Read: పైలట్ల తప్పిదమా? సాంకేతిక లోపమా.. ప్రమాదానికి ముందు ఏమైంది?
డీజీసీఎ రికార్డు ప్రకారం.. అజిత్ పవార్ వ్యక్తిగత భద్రతా అధికారి, సహాయకుడు విదీప్ జాదవ్, పింకీ మాలి, పైలట్లు కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శాంభవి పాఠక్లుగా ప్రమాదంలో మరణించారు.