Bengaluru : భారత్లో టెక్ సిటీగా అభివృద్ధి చెందుతోంది బెంగళూరు. టెకీలకు తొలి గమ్యస్థానంగా బెంగళూరు నగరాన్నే చెప్పుకుంటారు. అలాగే ఇండియా టాప్-5 నగరాల్లో బెంగళూరు కూడా ఒక్కటి. ఇలా రోజురోజుకు వేగంగా విస్తరిస్తున్న ఈ నగరంలో చినుకుపడితే మాత్రం చిత్తడి అవుతోంది. మోస్తారు వర్షాలకే రోడ్లు జలమయమవుతున్నాయి. ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజాగా బెంగళూరులో కురిసిన వర్షానికి ఓ తెలుగు సాఫ్ట్వేర్ ఉద్యోగిని ప్రాణాలు కోల్పోయింది.
ఏపీలోని కృష్ణా జిల్లా తేలప్రోలుకు చెందిన భానురేఖ సాఫ్ట్వేర్ ఉద్యోగిని. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని ఇన్ఫోసిస్ క్యాంపస్లో జాబ్ వచ్చింది. దీంతో అక్కడ వసతి ఏర్పాటు చేసుకోవడానికి ఫ్యామిలీతో కలిసి బెంగళూరు వెళ్లింది. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు.వారి కారు కేఆర్ కూడలికి చేరుకునే సమయానికి వర్షం తీవ్రమైంది. ముందుకు వెళ్లేలోగా అక్కడి అండర్పాస్లోకి వర్షపు నీరు చేరింది. నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో అండర్ పాస్లో నీరు నిలిచిపోయింది. దీంతో కారు అక్కడే చిక్కుకుపోయింది.
కారులో ఆరుగురు చిక్కుకున్నట్లు గుర్తించిన పోలీసులు, బెస్కాం సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగారు. వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా భానురేఖ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుటుంబ సభ్యులను సెయింట్ మార్థాస్ ఆసుపత్రిలో చేర్పించారు. బాధిత కుటుంబాన్ని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పరామర్శించారు. 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.
ఉన్నత చదువులు చదువుకొని, మంచి ఉద్యోగం సంపాదించిన భానురేఖ అనుకోని ఘటనతో అర్థాంతరంగా అనంత లోకాలకు వెళ్లింది. ఎంతో భవిష్యత్ ఉన్న యువతికి నూరేళ్లు నిండిపోయాయి. వర్షం పడితే నీరు నిలిచేలా అండర్ పాస్ నిర్మించిన అధికారులను ఇందుకు బాధ్యత వహించమనాలా? లేక కమిషన్ల కక్కుర్తికి సరైన ప్లానింగ్ లేకుండా అండర్ పాస్ నిర్మించిన పాలకులను అనలా..? భానురేఖ చనిపోయిన కేఆర్ కూడలి నగరం నడిబొడ్డున ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీకి కూత వేటు దూరంలోనే ఈ ప్రాంతం ఉంది. పేరుకు విశ్వనగరాలు అని గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ చిన్న చిన్నవర్షాలకే మనుషులు చనిపోతున్నారు.సాఫ్ట్వేర్ ఉద్యోగిని భానురేఖ మృతితో.. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులోనూ విషాదం నెలకొంది.