బెంగళూరు నగరంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అందులో ఒక వ్యక్తి వింతైన స్థితిలో కదలకుండా ఉండటాన్ని చూసి.. నగరంలోకి భయంకరమైన ‘జాంబీ డ్రగ్’ (జైలాజిన్) ప్రవేశించిందనే ఆందోళన ప్రజల్లో మొదలైంది. ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ఈ దృశ్యాలు వైరల్ కావడంతో నగరవాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ పరిణామాలపై బెంగళూరు సిటీ పోలీసులు తక్షణమే స్పందించారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి అసలు నిజాన్ని బహిర్గతం చేశారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మాదకద్రవ్యాలకు బానిస కాదని.. అది కేవలం ఆరోగ్య సమస్యలు, మందుల వికటించిన ప్రభావం మాత్రమేనని పోలీసులు స్పష్టం చేశారు.
బాగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యలహంక నిట్టే మీనాక్షి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సమీపంలో సదరు వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తిని పంజాబ్కు చెందిన వలస లారీ డ్రైవర్ రాజ్వీర్ సింగ్గా ధృవీకరించారు. జీవనోపాధి కోసం మూడు నెలల క్రితం అతను బెంగళూరుకు వచ్చాడని విచారణలో తేలింది. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే సమగ్ర వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్య నివేదికల ప్రకారం అతని రక్తంలో ఎటువంటి నిషేధిత నార్కోటిక్ లేదా సైకోట్రోపిక్ పదార్థాలు కనుగొనబడలేదు. రాజ్వీర్ సింగ్ చాలా కాలంగా ఆర్థ్రైటిస్ (కీళ్ల వాతం), సైనస్ సమస్యలతో బాధపడుతున్నాడని వైద్యులు గుర్తించారు.
వైద్యులు ఇచ్చిన సమాచారం ప్రకారం రాజ్వీర్ సింగ్ తన అనారోగ్యం కోసం సూచించిన పెయిన్ కిల్లర్స్ వాడాడు. ఆ మందులతో పాటు మద్యం సేవించడంతో అతని బాడీలో తీవ్రమైన రియాక్షన్ జరిగింది. దీనివల్ల అతను స్పృహ తప్పినట్లుగా.. దిక్కుతోచని స్థితిలో ఒకే చోట నిలబడిపోయాడు. ఈ స్థితిని చూసి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో ‘జాంబీ డ్రగ్’ బాధితుడిగా చిత్రీకరించారు. దీనివల్ల నగరంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వాస్తవానికి అక్కడ ఎటువంటి డ్రగ్స్ వాడకం జరగలేదని పోలీసులు అధికారిక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు.
అదంతా ఫేక్ న్యూస్..
నెటిజన్లు తప్పుడు సమాచారాన్ని షేర్ చేయవద్దని పోలీసులు గట్టిగా హెచ్చరించారు. ధృవీకరించని సమాచారం వల్ల వ్యక్తుల ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఇటువంటి తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెంగళూరు సిటీ పోలీస్ హెచ్చరిక జారీ చేసింది. డ్రగ్స్ విషయంలో తాము జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తున్నామని.. అసాంఘిక కార్యకలాపాలు కనిపిస్తే పోలీసులకు నేరుగా సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఫేక్ న్యూస్ను నమ్మొద్దు..
సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మడం ప్రమాదకరమని ఈ ఘటన నిరూపించింది. ఒక్క వైరల్ వీడియో వల్ల ఒక సామాన్య కార్మికుడు డ్రగ్ అడిక్ట్గా ముద్ర పడటం దురదృష్టకరం. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఏదైనా వార్తను ఇతరులకు పంపే ముందు అది నిజమో కాదో సరిచూసుకోవాలి. నిజం తెలిసేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుందన్న మాట ఇక్కడ అక్షరాలా నిజమైంది. కాబట్టి వదంతులను ప్రోత్సహించకుండా పోలీసు యంత్రాంగానికి సహకరించడం ప్రతి పౌరుని బాధ్యత.
ALSO READ: నన్ను ఎదగకుండా తొక్కేశారు.. నాడు దీనస్థితిపై విశ్వ ఎమోషనల్!