RJD: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఘోర పరాజయాన్ని చవిచూసింది. అధికారంలోకి రావాలనే ఆశలపై ఈ ఎన్నికల ఫలితాలు నీళ్లు చల్లాయి. జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి 202 సీట్లతో భారీ విజయాన్ని నమోదు చేయగా.. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. ఈ ఊహించని ఓటమి ఆర్జేడీని తీవ్ర నిరాశకు గురి చేసింది.
ఈ రాజకీయ పరాజయం తర్వాత ఆర్జేడీకి మరో పెద్ద షాక్ తగిలింది. పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె, పార్టీ నాయకురాలు రోహిణి ఆచార్య రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా, కుటుంబంతో కూడా సంబంధాలను తెంచుకుంటున్నట్లు తన అధికారిక ‘ఎక్స్’ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 24 గంటల లోపే ఆమె ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
పార్టీ మనుగడ కష్టమనుకుంటున్న ఈ దశలో కుటుంబంలోనూ విభేదాలు తలెత్తడం ఆర్జేడీకి మరింత ఆందోళన కలిగిస్తోంది. సంజయ్ యాదవ్, రమీజ్ తనను ఈ నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు రోహిణి ఆచార్య తన పోస్ట్లో పేర్కొన్నారు. మొదట రాజకీయాల నుంచి మాత్రమే తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ, ఆ తర్వాత ఆ పోస్ట్ను ఎడిట్ చేసి, ఈ ఇద్దరి పేర్లను చేర్చారు. అన్ని ఆరోపణలను తనపై వేసుకుంటానని కూడా ఆమె ప్రకటించారు.
ఆర్జేడీ సీనియర్ నాయకుల ప్రకారం, సంజయ్ యాదవ్తో రోహిణికి చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. ఈ విషయం బీహార్ ఎన్నికల ప్రచారంలోనూ స్పష్టమైంది. రోహిణి ఆచార్య చేపట్టిన బస్సు యాత్ర సమయంలో సంజయ్ యాదవ్ ముందు సీట్లో కూర్చోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక ఎక్స్ యూజర్ పోస్ట్ చేయగా.. రోహిణి దాన్ని షేర్ చేయడం అప్పట్లో దుమారం రేపింది. ఈ సంఘటన వారి మధ్య దూరాన్ని మరింత పెంచింది. రాజకీయ పరాజయం తర్వాత తలెత్తిన ఈ అంతర్గత కలహాలు ఆర్జేడీ భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.