2014 – 2019 మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ అంతా కేవలం అమరావతిపైనే ఉండేది. కానీ ఇప్పుడు ఆయన ఆలోచన పూర్తిగా మారిపోయింది. అమరావతి ఏపీకి ఏకైక రాజధానిగా ప్రకటించినా, అంతకంటే మిన్నగా విశాఖను అభివృద్ధి చేసే దిశగా కార్యాచరణ మొదలైంది. విశాఖను పాలనా రాజధానిగా చేస్తానన్న జగన్ రుషికొండను తొలిచి కేవలం ఒక గెస్ట్ హౌస్ మాత్రమే కట్టారనే విమర్శ ఉంది. కానీ విశాఖ విషయంలో, ఆ మాటకొస్తే ఉత్తరాంధ్ర మొత్తంపై ఈసారి చంద్రబాబు కాస్త గట్టిగానే ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతోంది.
వైజాగ్ కి కొత్త నిర్వచనం..
విశాఖలో జరుగుతున్న 30వ CII భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు వైజాగ్ కి కొత్త నిర్వచనం ఇచ్చారు.
V – విజన్
I -ఇన్నోవేషన్
Z – జీల్
A – యాస్పిరేషన్
G – గ్రోత్..
అంటూ విశాఖకు కొత్త నిర్వచనం ఇచ్చారు. పెట్టుబడుల కేంద్రం గా విశాఖను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వైజాగ్ ని కేవలం సాఫ్ట్ వేర్ హబ్ గా మాత్రమే కాదు, వివిధ రంగాల్లో ఏపీకి వైజాగ్ ని ప్రధాన కేంద్రంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
విశాఖ ఎకనమిక్ రీజియన్..
విశాఖతోపాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఒక బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసింది. దాని పేరు విశాఖ ఎకనమిక్ రీజియన్. శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖ జిల్లా, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, రాజమహేంద్రవరం, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలను ఒకే గొడుగు కిందకు చేరుస్తూ విశాఖ ఎకనమిక్ రీజియన్ (VER) ఏర్పాటు చేస్తున్నారు. ఈ VERకి ముఖ్యమంత్రి చంద్రబాబు చైర్మన్ గా ఉంటారు. ఆయనే ఎప్పటికప్పుడు దీని భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసి, పరిస్థితిని సమీక్షిస్తుంటారు.
9 జిల్లాల్లోని పలు అభివృద్ధి అంశాలతో ముందుకువెళతామని చెప్పారు చంద్రబాబు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలోని ఏరోసిటీని అభివృద్ధి చేసి.. ఆక్వా, ఇతర పరిశ్రమలను ఆకర్షిస్తామన్నారు. పర్యాటక, ఆరోగ్య సంరక్షణ రంగాలకు విశాఖను కేంద్రం చేస్తామన్నారు. విశాఖ-శ్రీకాకుళం కారిడార్ను షిప్ బిల్డింగ్ హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. శ్రీకాకుళం, అనకాపల్లిలో కూడా చిన్న విమానాశ్రయాలు నిర్మిస్తామన్నారు.
Also Read: కేసీఆర్ ఆరోగ్యంపై బీఆర్ఎస్ మౌనం.. అభిమానుల్లో ఆందోళన
ముంబైతో పోటీ..
ఏపీకి సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. దాన్ని అభివృద్ధి చేస్తే ఏపీకి తిరుగుండదనేది కూటమి ఆలోచన. విశాఖ ఎకనమిక్ రీజియన్, ముంబై రీజియన్ ని దాటి ముందుకు వెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. VER విజన్ లక్ష్యాలను సాధించే బాధ్యత ప్రజల మీద ఆధారపడి ఉందని అన్నారు సీఎం చంద్రబాబు. వారణాసి, సూరత్, ముంబైలకు గ్రోత్ హబ్ ప్రణాళికలు తయారుచేశారని, వాటిలో ముంబై ఇప్పటికే ముసాయిదాను ప్రారంభించిందని చెప్పిన ఆయన.. విశాఖ ఎకనమిక్ రీజియన్(VER) ప్రణాళిక అమలును వేగవంతం చేయాలని పేర్కొన్నారు.
Also Read: జూబ్లీ హిల్స్ గుణపాఠం.. కేటీఆర్ ఇకనైనా గ్రౌండ్ రియాల్టీ అర్థం చేసుకుంటారా?
Also Read: రేవంత్ నాయకత్వానికి ఢోకా లేనట్టే