Sonia Gandhi: ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కీలక నోటీసులు జారీ చేసింది. భారత పౌరసత్వం పొందే ముందు ఆమె పేరును ఓటర్ల జాబితాలో చేర్చారనే ఆరోపణలపై దాఖలైన పిటిషన్ను విచారించిన కోర్టు, ఈ విషయంలో వివరణ ఇవ్వాలని కోరుతూ సోనియా గాంధీతో పాటు ఢిల్లీ పోలీసులకు కూడా నోటీసులు పంపింది.
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందకముందే ఆమె పేరును ఓటర్ల జాబితాలో చేర్చడంపై పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పవన్ నారంగ్ వాదనలు వినిపిస్తూ, 1980 సంవత్సరంలో ఓటర్ల జాబితాలో సోనియా గాంధీ పేరును చేర్చడానికి నకిలీ పత్రాలు సృష్టించారని కోర్టుకు తెలిపారు. ఈ వాదనల నేపథ్యంలోనే ఆమె పేరును అప్పట్లో ఓటర్ల లిస్టు నుంచి తొలగించడం జరిగిందని వివరించారు.
అయితే, తర్వాత మళ్లీ 1983లో సోనియా గాంధీ పేరును ఓటర్ల జాబితాలో తిరిగి చేర్చడం జరిగిందని న్యాయవాది నారంగ్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పౌరసత్వం పొందిన అంశం, అలాగే ఓటర్ల జాబితాలో ఆమె పేరును చేర్చిన ప్రక్రియలపై స్పష్టమైన వివరణ అవసరమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
ఈ పిటిషన్ మరియు వాదనలను పరిగణలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఈ రెండు కీలక అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ సోనియా గాంధీకి, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను న్యాయస్థానం జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ALSO READ: Ind vs SA1st T20I: మరోసారి టాస్ ఓడిన టీమిండియా..గిల్, పాండ్యా వచ్చేశారు..ఇక కాటేరమ్మ కోత మొదలు