Shambhavi Pathak: పూణేలోని బారామతిలో జరిగిన ఘోర విమానం ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ అజిత్ పవార్ కన్నుమూశారు. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ సహా ఐదుగురు మృతి చెందారు. వీరిలో యంగ్ పైలట్ శాంభవి పాఠక్ ఒకరు. చిన్న వయస్సులోనే కమర్షియల్ విమానాలను నడిపే లైసెన్స్ సాధించిన ఆమె.. ఈ ప్రమాదంలో మృతి చెందారు. విమానాన్ని ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా నియంత్రణ కోల్పోయి కూలిపోయినట్లు సమాచారం.
పైలట్ ఇన్ కమాండ్ కెప్టెన్ సుమిత్ కపూర్ తో శాంభవి ఉన్నారు. దిల్లీకి చెందిన చార్టర్ సంస్థ వీఎస్ఆర్ నడుపుతున్న ఈ విమానంలో అజిత్ పవార్ తన వ్యక్తిగత భద్రతా అధికారి విదిత్ జాదవ్, అటెండర్ పింకీ మాలితో కలిసి ప్రయాణిస్తున్నారు. కెప్టెన్ సుమిత్ కపూర్ అనుభవజ్ఞుడైన కమర్షియన్ జెట్ పైలట్, పైలట్-ఇన్-కమాండ్ గా పనిచేస్తున్నారు. కార్పొరేట్ ఏవియేషన్లో 16,500 గంటలు సేవలందించారు. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో కీలకమైన విమాన నిర్ణయాలకు ఆయన బాధ్యత వహించారు. కెప్టెన్ శాంభవి పాఠక్ విమాన నిర్వహణ, నావిగేషన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో కమ్యూనికేషన్లో సహాయం చేస్తారు.
శాంభవి పాఠక్ ఎయిర్ఫోర్స్ బాలభారతి పాఠశాలలో చదువుకున్నారు. 2016-18 మధ్య సెకండరీ ఎడ్యుకేషన్ ను పూర్తిచేశారు. ముంబయి యూనివర్సిటీ నుంచి ఏరోనాటిక్స్, ఏవియేషన్, ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేశారు. న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ పైలట్ అకాడమీలో కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ తీసుకుని లైసెన్స్ పొందారు. అనంతరం భారత్కు వచ్చి డీజీసీఏ నుంచి కమర్షియల్ పైలట్ లైసెన్స్తో పాటు ఫ్రోజెన్ ఎయిర్లైన్ ట్రాన్స్పోర్ట్ పైలట్ లైసెన్స్ పొందారు. కొత్త పైలట్లకు ట్రైనింగ్ ఇచ్చేలా అసిస్టెంట్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్గానూ శాంభవి పనిచేశారు.
Also Read: అజిత్ పవార్ మృతిలో కుట్ర కోణం.. బెంగాల్ సీఎం సంచలన వ్యాఖ్యలు
2022 ఆగస్టు నుంచి వీఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఫుల్ టైమ్ ఫస్ట్ అధికారిగా జాయిన్ అయ్యారు. వీఐపీలు, బిజినెస్ ప్రముఖులు ప్రయాణించే లియర్జెట్-45 లాంటి విమానాలను నడపడంలో ఆమెకు అనుభవం ఉంది.