తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రభావం హైదరాబాద్ ఓటర్ల జాబితాపై తీవ్రంగా పడనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రెండు దశల్లో జరిగిన ఈ ప్రక్రియలో సుమారు 6.5 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించారు. మూడవ దశలో భాగంగా తెలంగాణలో ఈ ప్రక్రియ చేపట్టనుండటంతో.. రాజధాని నగరం హైదరాబాద్లో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారిని గుర్తించి తొలగించడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశ్యం.
ఓటర్ల జాబితా నుండి పేర్లను తొలగించేటప్పుడు అధికారులు ప్రధానంగా ASD (Absent, Shifted, Dead/Duplicate) కేటగిరీని పరిగణనలోకి తీసుకుంటున్నారు. చిరునామాలో దొరకని వారు (Absent), ఇతర ప్రాంతాలకు లేదా విదేశాలకు శాశ్వతంగా వెళ్ళిపోయిన వారు (Shifted), మరణించిన వారు (Dead), ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉన్న వారిని (Duplicate) ఈ జాబితాలో చేరుస్తారు. గత 14 ఏళ్లలో హైదరాబాద్ నుండి విదేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన వారి సంఖ్య పెరగడం, మరణించిన వారి పేర్లు ఇంకా జాబితాలోనే ఉండటంతో ఓటింగ్ శాతం గణనీయంగా పడిపోతోంది. 2024 ఎన్నికల్లో హైదరాబాద్లో కేవలం 48.7 శాతం పోలింగ్ నమోదు కావడం ఈ అస్తవ్యస్త జాబితాకు నిదర్శనంగా అధికారులు భావిస్తున్నారు.
ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఓటరు జాబితాలో ఉన్నవారు కొత్తగా డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే, వారి వివరాలలో లోపాలు ఉన్నా లేదా మ్యాపింగ్ జరగకపోయినా నోటీసుల దశలో ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్యూమరేషన్ ఫాంలో తండ్రి, తల్లి లేదా తాతామామ్మల వివరాలు ఇవ్వడం ద్వారా మ్యాపింగ్ ప్రక్రియను సులభతరం చేయవచ్చు. ఒకవేళ 2002 ఓటర్ల జాబితాలో ఓటరు పేరు గానీ.. వారి పూర్వీకుల పేరు గానీ లేకపోతే, ప్రభుత్వం సూచించిన 11 రకాల డాక్యుమెంట్లలో ఒక దానిని సమర్పించాలి. ఇందులో పాస్పోర్ట్, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, విద్యార్హత పత్రాలు, కుల ధృవీకరణ పత్రం లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డులు సమర్పించవచ్చు.
ఈ స్పెషల్ రివిజన్ ప్రక్రియలో డాక్యుమెంట్ల సమర్పణ అనేది ఓటరు పుట్టిన తేదీపై ఆధారపడి ఉంటుంది. జూలై 1, 1987 కంటే ముందు జన్మించిన వారు తమ సొంత డాక్యుమెంట్లు సమర్పిస్తే సరిపోతుంది. జూలై 1, 1987 నుండి డిసెంబర్ 2, 2004 మధ్య జన్మించిన వారు తమ పత్రాలతో పాటు తండ్రి లేదా తల్లి ధృవీకరణ పత్రం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక డిసెంబర్ 2, 2004 తర్వాత జన్మించిన వారు మాత్రం తమ పత్రాలతో పాటు తల్లిదండ్రుల ఇద్దరి డాక్యుమెంట్లను సమర్పించడం తప్పనిసరి. ఈ నిబంధనల ద్వారా అర్హులైన వారికే ఓటు హక్కు ఉండేలా, అక్రమ ఓట్లకు తావులేకుండా ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపడుతోంది.