పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతాయని వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం తాజాగా తోసిపుచ్చింది. ఇంధన ధరల పెంపుపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ఎన్నికల ఫలితాల తర్వాత సామాన్యుడిపై భార పడుతుందన్న ఊహాగానాలకు ఈ ప్రకటనతో తెరపడింది.
పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా క్రూడాయిల్ సరఫరాపై కొంత ప్రభావం పడిన మాట వాస్తవమేనని సుజాత శర్మ పేర్కొన్నారు. ఎల్పీజీ (LPG), పీఎన్జీ (PNG) దిగుమతుల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ దేశీయ అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆమె వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులను నిరంతరం గమనిస్తున్నామని భారత్లో ఇంధన భద్రతకు ఎటువంటి ముప్పు లేదని కేంద్రం ధీమా వ్యక్తం చేసింది.
దేశంలో ఇంధన లభ్యత విషయంలో ఎటువంటి కొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. చమురు కంపెనీల వద్ద తగినంత స్టాక్ ఉందని పంపిణీ వ్యవస్థ సక్రమంగానే సాగుతుందని అధికారులు వెల్లడించారు. ధరల పెరుగుదలపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని మంత్రిత్వ శాఖ కోరింది. అంతర్జాతీయంగా ఎటువంటి భౌగోళిక రాజకీయ మార్పులు సంభవించినా వినియోగదారులపై భారం పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ సెక్రటరీ తెలిపారు. చమురు దిగుమతుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను సైతం ప్రభుత్వం అన్వేషిస్తోంది.
సామాన్యుల బడ్జెట్పై ప్రభావం చూపే పెట్రో ఉత్పత్తుల ధరల విషయంలో ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గత కొన్నాళ్లుగా ధరలు స్థిరంగా ఉన్నాయని అదే ఒరవడి మున్ముందు కూడా కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని ఇంధన ధరల నియంత్రణకు కట్టుబడి ఉన్నామని కేంద్రం వివరించింది. భయాందోళనలతో పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టాల్సిన పనిలేదని నిల్వలు పుష్కలంగా ఉన్నాయని సుజాత శర్మ మరోసారి స్పష్టం చేశారు.
ALSO READ: బంకుల్లో ఇంధన కొరతపై మంత్రి నాదెండ్ల సమీక్ష.. ఇసుక ర్యాంపులో అక్రమ డీజిల్ దందా!