![china news today](https://www.bigtvlive.com/wp-content/uploads/2024/04/CHINA-1280-x-720.jpg)
China arunachal pradesh news(Today’s breaking news in India): చైనా తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్ పై మరో వివాదాన్ని రేపింది. ఆ రాష్ట్రంలోని 30 ప్రాంతాలు తమ దేశంలో భాగంగా పేర్కొంది. వాటికి పేర్లు కూడా పెట్టేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి నిత్యం డ్రాగన్ వివాదాలను రేపుతోంది.
చైనా ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్ లోని 30 ప్రాంతాలకు పేర్లు పెట్టినట్లు ఇటీవల ఆ దేశ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ కథనం ప్రచురించింది. చైనా తమవిగా పేర్కొన్న వాటిలో 11 నివాసిత ప్రాంతాలు ఉన్నాయి. 12 పర్వతాలు, 4 నదులు, సరస్సు, పర్వత మార్గం, మరో భూభాగం తమవేనని ఆ కథనంలో పేర్కొంది. ఆ 30 ప్రాంతాలకు చైనీస్, టిబెటన్, పిన్ యిన్ భాషల్లో పేర్లు పెట్టిందని తెలుస్తోంది.
అరుణాచల్ ప్రదేశ్ లోని జాంగ్ నన్ ప్రాంతంపై చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. ఈ క్రమంలోనే డ్రాగన్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జాంగ్ నన్ లో 30 ప్రాంతాలకు పేర్లు పెట్టింది. మే 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
Also Read: మావల్లే ఆ విషయం బయటకు.. అది తప్పు..
అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలో భాగమని డ్రాగన్ చాలాకాలంగా వితండవాదం చేస్తోంది. ఈ క్రమంలో ఆ భూభాగాన్ని జాంగ్నన్ గా పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడం ఇది నాలుగోసారి. 2017లో 6 ప్రాంతాలకు, 2021లో 15 ప్రాంతాలకు, 2023 ఏప్రిల్లో 11 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టుకుంది.
అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా వ్యవహార శైలిపై భారత్ అభ్యంతరం తెలిపింది. వాస్తవాలను ఎవరూ మార్చలేరని స్పష్టం చేసింది. పేర్లు పెట్టుకున్న మాత్రాన ఆ ప్రాంతాలు చైనాకి చెందవని తేల్చిచెప్పింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని కుండబద్దలు కొట్టింది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ పర్యటనపైనా చైనా అభ్యంతరం తెలిపింది. ఆ సమయంలో కూడా చైనాకు భారత్ ధీటుగా బదులిచ్చింది.