తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా వెలుగొందుతున్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సొంత నియోజకవర్గంలోనే ఓటమి పాలయ్యారు. కొళత్తూరు నుంచి డీఎంకే అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయనపై తమిళగ వెట్రి కళగం (TVK) అభ్యర్థి వీఎస్ బాబు అనూహ్య విజయం సాధించారు. గత దశాబ్ద కాలంగా ఈ నియోజకవర్గంలో స్టాలిన్కు తిరుగులేకపోయినా.. ఈసారి విజయ్ మేనియాను తట్టుకోలేకపోయారు. ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు పరాజయం చెందడం డీఎంకే శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
తమిళనాడు రాజకీయాల్లో కొళత్తూరు నియోజకవర్గం అత్యంత కీలకమైంది. 2011 నుంచి స్టాలిన్ ఇక్కడే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా సునాయాసంగా గెలుస్తారని అందరూ భావించినా.. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు గట్టి సవాల్ విసిరారు. రౌండ్ రౌండ్కు ఆధిక్యం మారుతూ ఉత్కంఠ రేపిన ఈ పోరులో చివరకు బాబుదే పైచేయి అయింది. విజయ్ రాజకీయ ఎంట్రీ తమిళనాడులో సంప్రదాయ రాజకీయాలను మలుపు తిప్పిందనడానికి స్టాలిన్ ఓటమే నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. సామాన్య ఓటర్లు సైతం మార్పు కోరుకోవడమే స్టాలిన్ పతనానికి కారణమైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రితో పాటు ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా తన నియోజకవర్గంలో వెనుకబడి ఉండటం పార్టీని మరింత ఆందోళనలో పడేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీచాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఒక ప్రభంజనంలా దూసుకుపోతుండటంతో డీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద నిశ్శబ్దం నెలకొంది. స్టాలిన్ లాంటి ఉద్దండుడు ఓడిపోవడం తమిళ రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలికినట్లయింది. భవిష్యత్తులో ద్రవిడ రాజకీయాలు ఏ దిశగా సాగుతాయోనన్న ఆసక్తి సర్వత్ర నెలకొంది.
ALSO READ: బెంగాల్లో బీజేపీ ప్రభంజనం.. ముఖ్యమంత్రి పీఠంపై సువేందు అధికారి?