Renuka Chowdary: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజే అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ మహిళా ఎంపీ రేణుకా చౌదరి తన పెంపుడు కుక్కను పార్లమెంట్ ఆవరణలోకి తీసుకురావడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై బీజేపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, భద్రతా నిబంధనలు ఉల్లంఘించారంటూ విమర్శలు గుప్పించారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల కోసం ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణానికి చేరుకుంటున్న సమయంలో, రేణుకా చౌదరి తన కారులో చిన్న కుక్కను తీసుకువస్తున్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే ఈ అంశం సభ మొత్తంలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బీజేపీ ఎంపీలు పార్లమెంట్ వంటి అత్యంత భద్రతా ప్రాంతంలో.. జంతువును ఎలా అనుమతించారు? అంటూ తీవ్రంగా ప్రశ్నించారు.
ఈ ఘటనపై రేణుకా చౌదరి మాట్లాడుతూ.. ఏదైనా చట్టం ఉందా? జంతువును తీసుకురావడం నిషేధమని స్పష్టంగా ఎవరైనా చూపిస్తే నేను అంగీకరిస్తాను. నేను కావాలనే కుక్కను తీసుకురాలేదు. ఒక స్కూటర్ కారు ఢీకొట్టిన ఘటన తర్వాత ఆ చిన్న కుక్క పిల్ల రోడ్డుపై ఒంటరిగా తిరుగుతూ కనిపించింది. వాహనాలు ఢీకొడతాయేమోనని భయపడి దాన్ని రక్షించాలనే ఉద్దేశంతో కారులో వేసుకుని పార్లమెంటుకు వచ్చాను. తర్వాత వెంటనే దాన్ని వెనక్కి పంపించేశాను. కారు వెళ్లిపోయింది.. కుక్క కూడా వెళ్లిపోయింది” అని చెప్పారు.
మనమొక మూగ జంతువును కాపాడటాన్ని కూడా ఇప్పుడు పెద్ద వివాదంగా మారుస్తున్నారు. ఈ చర్చ వల్ల అసలు ప్రయోజనం ఏమిటి? దేశంలో ఎన్నో అసలైన సమస్యలు ఉన్నాయి. వాటిపై చర్చించాల్సిన అవసరం లేదా? ప్రతిరోజూ మనల్ని కరిచే వారి గురించి మనం మాట్లాడము అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీలు ఘాటుగా స్పందించారు. పార్లమెంట్ భద్రతకు సంబంధించిన నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయని, అలాంటి ప్రాంగణంలో పెంపుడు జంతువులను అనుమతించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు.
Also Read: గాంధీ కుటుంబానికి బిగించిన ఉచ్చు: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్పై క్రిమినల్ కుట్ర కేసు..
సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వైరల్గా మారింది. కొందరు రేణుకా చౌదరి చేసిన చర్యను మానవత్వానికి నిదర్శనంగా ప్రశంసిస్తే, మరికొందరు పార్లమెంట్ గౌరవం, భద్రత వంటి అంశాలను తక్కువ చేసిన చర్యగా తప్పుబట్టారు. రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాదనలు సాగుతున్నాయి.