Whatsapp: కమ్యూనికేషన్ యాప్స్లో దుర్వినియోగాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ను ప్రవేశపెట్టింది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై వంటి కమ్యూనికేషన్ యాప్స్కు సిమ్ కార్డ్ బైండింగ్ను తప్పనిసరి చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి 90 రోజుల్లో మెసేజింగ్ యాప్స్ అన్నీ సిమ్కార్డుతో కనెక్ట్ అయ్యేలా చూడాలని నిబంధనలను అమలు చేసింది. ఈ క్రమంలో డివైజ్లో సిమ్కార్డు ఉంటేనే.. యాప్ పనిచేసేలా చూడాలని సూచనలు చేసింది. మెసేజింగ్ యాప్స్ దుర్వినియోగం కాకుండా చూడటమే లక్ష్యంగా ఈ నిబంధనను తీసుకొచ్చినట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు.
కమ్యూనికేషన్ యాప్స్ను టెలి కమ్యూనికేషన్ ఐడెంటిఫైర్ యూజర్ ఎంటింటీస్గా పేర్కొంటారు. ఇక నుంచి ఆయా సంస్థలు తమ సేవలను వచ్చే 90రోజుల్లో సిమ్కార్డుతో అనుసంధానమయ్యేలా చూసుకోవాలి. యూజర్ ఏ సిమ్తో అయితే యాప్లో అకౌంట్ రిజిస్టర్ చేశారో.. ఆ సిమ్ ఉంటేనే యాప్ పని చేస్తుంది. సిమ్ తీసేసినా లేదా ఫోన్ మార్చినా యాప్ ఆటోమాటిక్గా లాగౌట్ అవుతుంది. ఒకవేళ యూజర్ వెబ్ బ్రౌజర్ ద్వారా సేవలు పొందితే సదరు ప్లాట్ఫామ్ ప్రతి ఆరు గంటలకు లాగౌట్ అయ్యేలా చూడాలి. మళ్లీ సేవలు పొందాలంటే QRకోడ్ ద్వారా లాగిన్ అవ్వాల్సిందే.
Also Read: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్కు మీ స్టైల్లోనే రిప్లై!
ప్రస్తుతం ఫోన్లో ఏదైనా యాప్ను ఇన్స్టాల్ చేసేటప్పుడు సిమ్కార్డ్ను ధ్రువీకరించుకుంటున్నారు. ఒకవేళ సదరు డివైజ్ నుంచి సిమ్కార్డ్ను తీసేసినా, డీయాక్టివేట్ చేసినా సేవలు మాత్రం కొనసాగుతున్నాయి. ఫలితంగా ఇతర దేశాల్లో ఉండే సైబర్ నేరగాళ్లు యాప్స్ను వినియోగించుకోవడానికి సాధ్యమవుతోంది. తాజాగా కేంద్రం తీసుకొచ్చిన ఈ సిమ్ బైండింగ్ నిబంధనతో మోసపూరిత కార్యకలాపాలు తగ్గుతాయని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. కమ్యూనికేషన్ యాప్స్ దుర్వినియోగం కాకుండా.. నిత్యం సిమ్ కార్డుతో అనుసంధానం అయ్యేలా చూడటం ఈ రూల్ ముఖ్య ఉద్దేశం అని తెలుస్తోంది. ఇకపై ఎవరైతే డీయాక్టివేట్ ఐన సిమ్కార్డుతో వాట్సప్ వంటి యాప్స్ను వినియోగిస్తున్నారో వారు కూడా ఈ నిబంధనతో సేవలు పొందలేరు.
సైబర్ మోసాలు, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో ఏ మొబైల్ నంబరు అయినా దుర్వినియోగం అయితే.. ఆ సిమ్ ఎవరి పేరు మీద ఉంటే.. వాళ్లే బాధ్యత వహించాలని కేంద్రం స్పష్టం చేసింది. కాబట్టి.. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, ట్యాంపర్ చేసిన IMEI నంబర్లు ఉండే.. ఫోన్లను వాడొద్దని తెలిపింది. నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి లేదా ఇతరుల పేరిట సిమ్ కార్డులు తీసుకోరాదని హెచ్చరించింది. ముఖ్యంగా మీ పేరు మీద తీసుకున్న సిమ్ కార్డులను ఇతరులకు ఇవ్వరాదని, అలా చేయడం వల్ల వారు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
Also Read: ఏఐలకే బాబు ఏజెంటిక్ ఏఐ.. మానవ ప్రమేయం అక్కర్లేదట!