Mallikarjun Kharge: 2025 సంవత్సరం ముగుస్తున్న వేళ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ పాలన 11వ ఏట దేశం ఏ దిశగా పయనించిందో వివరిస్తూ ఆయన ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది పొడవునా బీజేపీ దోపిడీ, అవినీతి, దుష్ప్రవర్తన దేశ ప్రజలపై ఆధిపత్యం చెలాయించాయని ఆయన మండిపడ్డారు.
దేశంలో MNREGA (ఉపాధి హామీ పథకం)ను నిర్వీర్యం చేయడం ద్వారా లక్షలాది మంది పేదల రాజ్యాంగబద్ధమైన “పని హక్కు”ను ప్రభుత్వం లాగేసుకుందని ఖర్గే ఆరోపించారు. యువత నిరుద్యోగిత రేటు గరిష్ట స్థాయిలోనే ఉండగా, పేపర్ లీక్ మాఫియా యథేచ్ఛగా సాగుతోందన్నారు. రూపాయి విలువ పతనాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, ఆర్బీఐ 32 బిలియన్ డాలర్లను విక్రయించినా ఫలితం లేదని విమర్శించారు. దేశ సంపదలో 40 శాతం కేవలం 1 శాతం సంపన్నుల చేతిలోనే ఉందంటూ పెరిగిన ఆర్థిక అసమానతలను ఎత్తిచూపారు.
BLO శిక్షణ లేకుండానే లక్షలాది మంది ఓటర్ల పేర్లను తొలగించి, వారి “ఓటు హక్కు”ను హరించారని, ఇది బీజేపీ ఓట్ల దొంగతనానికి నిదర్శనమని ఖర్గే దుయ్యబట్టారు. పహల్గామ్ ఉగ్రదాడికి మన సైన్యం దీటుగా బదులిచ్చినా, బీజేపీ మంత్రులు మాత్రం అమరులైన కల్నల్ను అవమానించారని గుర్తుచేశారు. అధ్యక్షుడు ట్రంప్, చైనాలు కశ్మీర్ అంశంలో ‘మధ్యవర్తిత్వం’ గురించి మాట్లాడుతున్నా ప్రధాని మోడీ మౌనం వహించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. మోడీకి మిత్రుడైన ట్రంప్, మన దేశంపైనే ప్రపంచంలో అత్యధిక సుంకాలను విధించారని ఎద్దేవా చేశారు.
మణిపూర్లో మోడీ-షా ద్వయం విఫలమైందని, ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే అక్కడ రాష్ట్రపతి పాలన విధించారని విమర్శించారు. దేశ రాజధానితో సహా ఉత్తర భారతం కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా ప్రభుత్వానికి రోడ్మ్యాప్ లేదన్నారు. ఆరావళి ప్రాంతాన్ని మైనింగ్ మాఫియాకు అప్పగించే కుట్రతో పాటు, హస్డియో, నికోబార్ అడవులపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుంభమేళా తొక్కిసలాటలు, రైల్వే స్టేషన్ ప్రమాదాలు, విషపూరిత దగ్గు మందు మరణాలకు ఎవరూ బాధ్యత వహించడం లేదని ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Saudi Arabia UAE Conflict: సౌదీ దెబ్బకు దిగొచ్చిన యూఏఈ.. యెమెన్ నుంచి బలగాల ఉపసంహరణ!