రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన నివాసానికి (ఫామ్హౌస్) చేరుకున్న మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిలతో కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. రాబోయే సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయాలి..? ప్రజా సమస్యలపై గులాబీ దళం ఏ స్టాండ్తో ముందుకు వెళ్లాలనే అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, పథకాల అమలులో జరుగుతున్న జాప్యం, హామీల వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రైతు భరోసా, రుణమాఫీ, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపులో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై గట్టిగా గళం ఎత్తాలని ఆయన సూచించారు. ప్రతి అంశంపై లోతైన అధ్యయనం చేసి, సాక్ష్యాధారాలతో సహా సభలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ప్రాజెక్టులు – నిధుల కేటాయింపుపై పక్కా వ్యూహం..
నీటి పారుదల ప్రాజెక్టులు, గత ప్రభుత్వం ప్రారంభించిన పనులకు నిధుల నిలిపివేత వంటి విషయాల్లో రాజీ పడకూడదని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం ఇస్తున్న గణాంకాలను ప్రశ్నిస్తూ.. వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని కేసీఆర్ సూచించారు. చర్చకు తగిన సమయం ఇవ్వాలని పట్టుబట్టాలని, ఒకవేళ ప్రభుత్వం చర్చను పక్కదారి పట్టించాలని చూస్తే సభలో గళం ఎత్తి పోరాడాలని ఆయన ఉద్బోధించారు.
గులాబీ దళానికి దిశానిర్దేశం..
అసెంబ్లీలో అనుసరించాల్సిన ఎత్తుగడలపై హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిలకు కేసీఆర్ కీలక సూచనలు చేశారు. ప్రతిపక్షంగా మన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రజా పక్షాన నిలబడి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన పేర్కొన్నారు. గులాబీ జెండా సిద్ధాంతం, తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా సభలో వ్యవహరించాలని, స్పీకర్ పోడియం వద్దైనా సరే నిరసన తెలపడానికి వెనుకాడకూడదని ఈ భేటీలో నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమావేశం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
ALSO READ: Srisailam: శ్రీశైలం ఘాట్ రోడ్డులో లిఫ్ట్ అడుగుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త, మహిళ వీడియో వైరల్