Delhi IGI Airport Advisory: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో విమాన ప్రయాణాలకు భారీ అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI) అధికారులు హెచ్చరించారు. భద్రతా కారణాల దృష్ట్యా పలు విమానయాన సంస్థలు తమ మార్గాలను మార్చుకోవడం లేదా సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని విదేశాలకు వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని విమానాశ్రయ అడ్వైజరీ సూచించింది.
మధ్యప్రాచ్యం మీదుగా ప్రయాణించే విమానాల షెడ్యూల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది. దీనివల్ల ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ప్రయాణానికి సిద్ధమయ్యే వారు విమానాశ్రయానికి బయలుదేరే ముందే తమ సంబంధిత విమానయాన సంస్థల (Airlines) ప్రతినిధులను సంప్రదించి విమాన స్థితిగతులను (Flight Status) సరిచూసుకోవాలని స్పష్టం చేశారు. ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే తమ ప్రయాణికులకు సందేశాల ద్వారా సమాచారం అందిస్తున్నప్పటికీ.. ప్రయాణికులు స్వయంగా వెబ్సైట్లు లేదా హెల్ప్లైన్ నంబర్ల ద్వారా ధృవీకరించుకోవడం ఉత్తమమని సూచించారు.
యుద్ధం కారణంగా గగనతల వినియోగంపై ఆంక్షలు విధించడం వల్ల విమానాలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడంతో పాటు ఇంధన ఖర్చులు కూడా భారమయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ విమానాశ్రయం నుండి యూరప్, అమెరికా, మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే ప్రయాణికులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చక్కబడే వరకు ప్రయాణాల్లో అనిశ్చితి కొనసాగవచ్చని.. కాబట్టి ప్రయాణికులు విమానయాన సంస్థల నుండి వచ్చే తాజా సమాచారాన్ని నిరంతరం గమనిస్తూ ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Read Also: Israel Attacks On Iran: ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు.. క్షిపణులతో విధ్వంసం