Delhi Blast Case: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటన ఎంతవరకు వచ్చింది? ఈ కేసులో తీగలాగితే డొంక కదిలిందా? ఢిల్లీ పేలుడు-ఫరీదాబాద్ వైట్ కాలర్ ఉగ్ర మాడ్యూల్కి లింకేంటి? ఇప్పటివరకు ఎంతమంది అరెస్టు అయ్యారు? పేలుడు వెనుక మాస్టర్ మైండ్ ఇమామ్ ఇర్ఫాన్ అహ్మదేనా? అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు.
దేశంలో భారీ పేలుళ్లకు ప్లాన్ చేశారు టెర్రరిస్టులు. ఇందులో నేరుగా పాల్గొనకుండా దేశంలోని కొందరు డాక్టర్లను ఎంపిక చేసుకున్నారు. వారి ద్వారా బలమైన నెట్వర్క్ని ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారమంతా జమ్మూకాశ్మీర్ యువతీ యువకుల ద్వారానే నడిపించాలని స్కెచ్ వేశారు. వచ్చే ఏడాది జనవరి 26న ఎర్రకోట వద్ద భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. దీపావళికి రద్దీగా ఉండే ప్రదేశంలో దాడి చేయాలని ప్లాన్ చేశామని, దానిని అమలు చేయలేకపోయామని నిందితుడు పోలీసులకు చెప్పినట్టు దర్యాప్తు వర్గాలు తెలిపాయి.
ఈ క్రమంలో పేలుడు పదార్థాలను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ఫరీదాబాద్లో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడడం వెనుక ఇదే కారణమని అంటున్నారు. ఢిల్లీ పేలుడు కేసులో అరెస్టయిన కీలక నిందితుడు ముజమ్మిల్ విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. పేలుడు ఘటనకు ముందు తాను-ఉమర్ ఎర్రకోటకు వెళ్లినట్టు చెప్పాడట. అతడి ఫోన్ డేటాలో లభించిన కీలకమైన సమాచారం ఆధారంగా వచ్చే ఏడాది జనవరి 26న దాడికి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాలను రెక్కీ నిర్వహించినట్లు తేలింది. ఎర్రకోట వద్ద పేలుడు ఘటనకు ముందు కారును నడిపిన వ్యక్తి కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీగా గుర్తించారు. అతడి సన్నిహితుడు ఫరీదాబాద్కు చెందిన ముజమ్మిల్. అతడ్ని విచారించిన పోలీసులకు ఈ కీలక విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది.
ఫరీదాబాద్ ఆపరేషన్లో భాగమైనవారు డాక్టర్లని తేలడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ టెర్రర్ మాడ్యూల్ వెనక ఉన్న ప్రధాన సూత్రధారి ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ అని నిర్థారణకు వచ్చాయి అధికారులు. ప్రస్తుతం అతడ్ని జమ్మూకాశ్మీర్లో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇర్ఫాన్ గురించి ఆరా తీయగా అధికారులకు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇర్ఫాన్ సొంతూరు జమ్మూకాశ్మీర్లోని షోపియాన్ ప్రాంతానికి చెందినవాడు. మెడికోలకు ఉగ్రవాద భావజాలాన్ని నూరుపోయడంలో కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. శ్రీనగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్ సిబ్బందిగా అతడికి పని చేసిన అనుభవం ఉంది. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ నుంచి ప్రేరణ పొందిన ఇర్ఫాన్.. ఫరీదాబాద్లోని మెడికోలకు బ్రెయిన్ వాష్ చేశాడట.
జైషేకు సంబంధించిన వీడియోలను ఆయా విద్యార్థులకు పదే పదే చూపించి రెచ్చగొట్టినట్టు తెలుస్తోంది. విద్యార్థులను పూర్తిగా ఉగ్రవాదం వైపు నడిపించడమే లక్ష్యంగా పని చేసినట్లు నిఘా వర్గాల మాట. దీనికితోడు ఇంటర్నెట్ కాల్స్తో అఫ్గాన్లోని కొంతమందితో సంప్రదింపులు జరిపినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఢిల్లీ పేలుడు ఘటనలో సంచలన విషయాలు
పేలుడుకు ముందు నిందితులు ఎర్రకోట వద్ద రెక్కీ చేసినట్లు సమాచారం
వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలను లక్ష్యంగా చేసుకుని దాడికి ప్లాన్ చేసినట్లు దర్యాప్తు వర్గాల సమాచారం
ఉమర్తో కలిసి రెక్కీ చేసినట్లు ముజమ్మిల్ అంగీకరించాడన్న దర్యాప్తు వర్గాలు pic.twitter.com/wGMUYtIKf4
— BIG TV Breaking News (@bigtvtelugu) November 12, 2025