Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్.. వీటి ద్వారా సెలబ్రిటీలు ఏ మేరా లాభపడ్డారో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం వరుసగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పవచ్చు.. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ.. యువత జీవితాలతో ఆడుకుంటూ.. ఎన్నో కుటుంబాలకు తీరని నష్టాన్ని మిగిల్చారు అనడంలో సందేహం లేదు. తమ అభిమాన నటీనటులు ఏం చెప్పినా నమ్మే అభిమానులు ఈ కాలంలో ఉన్నారు కాబట్టే సెలబ్రిటీలు ఇలా తమకు లాభం వచ్చే విషయాలను మాత్రమే పట్టించుకుంటూ.. అందులో నష్టాలను గమనించకుండా ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు అనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికే 29 మంది సెలబ్రిటీలపై కేసు ఫైల్ అవ్వగా.. ఒక్కొక్కరిని ఈడీ విచారిస్తూ మనీ లాండరింగ్ కేసుతో పాటు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై కూడా విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సిఐడి రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే తాజాగా నేడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) సిఐడి ముందు విచారణకు హాజరుకానున్నారు. విషయంలోకి వెళ్తే..బెట్టింగ్ యాప్స్ కేసులో సిఐడి అధికారులు ప్రకాష్ రాజ్ ను నేడు విచారించనున్నారు. దీంతో ఈయన ఇచ్చే స్టేట్మెంట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి ఈ విషయంలో ప్రకాష్ రాజ్ ఎలా స్పందిస్తారు? ఆయన స్టేట్మెంట్ ఏంటి ? అనే విషయం తెలియాలి అంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే..
ఇదిలా ఉండగా మరొకవైపు ఇదే కేసులో ఆగస్టు 6వ తేదీన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఏ 23 అనే గేమింగ్ యాప్ ను ఆయన ప్రమోట్ చేయడంతోనే ఆరోజు విచారణ జరిపారు. అయితే నిన్న సిఐడి విచారణ జరిపింది. అలా విచారించిన అధికారులు బ్యాన్ చేసిన యాప్ ను ఎలా ప్రమోట్ చేశారు? అంటూ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన విజయ్ దేవరకొండ..” తాను చట్టబద్ధమైన ఏ 23 యాప్ ను మాత్రమే ప్రమోట్ చేశానని.. తాను ప్రమోట్ చేసిన ఏ 23 గేమింగ్ యాప్ తెలంగాణలో ఓపెన్ అవ్వదని” సిఐడి కి స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు ఇకపై తాను ఎలాంటి గేమింగ్, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయనని విజయ్ దేవరకొండ చెప్పడంతో పాటు అందుకు సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించారు.
ALSO READ:Hero Dharmendra: క్షేమంగా డిస్చార్జ్ అయిన హీరో ధర్మేంద్ర!
ఇకపోతే విజయ్ దేవరకొండను విచారించిన అనంతరం ప్రముఖ బిగ్ బాస్ బ్యూటీ, సీరియల్ నటి సిరి హనుమంతు (Siri hanumanth) ని కూడా అధికారులు విచారించారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ వచ్చిన డబ్బులతో ఏకంగా మూడు బ్యూటీ ట్రీట్మెంట్ హాస్పిటల్స్ ను సిరి హనుమంతు నిర్మించి నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పైగా గోవిందా 369 అనే బెట్టింగ్ యాప్ ను కూడా సిరి హనుమంతు ప్రమోట్ చేసింది. జీరో పర్సెంట్ టాక్స్ అంటూ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసినట్లు సిఐడి అధికారులు ఆధారాలు సేకరించారు. ముఖ్యంగా సిరిని అధికారులు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం వల్ల వచ్చిన డబ్బును ఏం చేశారు ? ఎలా తీసుకున్నారు? ఆ బెట్టింగ్ యాప్స్ వారితో పరిచయం ఎలా ఏర్పడింది? ఇలా పలు వివరాల గురించి అడిగినట్లు సమాచారం.