ఢిల్లీ మద్యం విధానం కేసులో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా ఇతర నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు వెలువరించిన తీర్పుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రౌజ్ అవెన్యూ కోర్టు జడ్జి తన తీర్పులో చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం రేపు విచారించనుంది.
మద్యం పాలసీ కేసులో తొలుత సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఆ విచారణ ఆధారంగానే ఈడీ రంగంలోకి దిగి మనీలాండరింగ్ కోణంలో కేసులు నమోదు చేసింది. అయితే ఇటీవల తీర్పు వెలువరించిన రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి దర్యాప్తు సంస్థల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కే. కవితతో పాటు మొత్తం 23 మందిని ఈ కేసు నుంచి విముక్తి చేస్తూ సంచలన తీర్పునిచ్చారు. నిందితులపై మోపిన అభియోగాలకు సంబంధించి సరైన ఆధారాలను చూపడంలో సీబీఐ విఫలమైందని కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ అంతా తప్పుల తడకగా ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దర్యాప్తు సంస్థ సమర్పించిన పత్రాల్లో స్పష్టత లేదని పేర్కొన్నారు. నిందితులకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు లేవని స్పష్టం చేస్తూ అందరినీ నిర్దోషులుగా ప్రకటించారు. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థల విశ్వసనీయతపై కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తమ దర్యాప్తు తీరును తప్పుబట్టేలా ఉన్న ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఈడీ హైకోర్టును కోరుతోంది.
రేపు జరగబోయే విచారణలో హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పటికే రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపింది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు దీనిని తమ నైతిక విజయంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ దాఖలు చేసిన తాజా పిటిషన్ ప్రాధాన్యత సంతరించుకుంది.
ALSO READ: Mahesh Kumar Goud: రాజకీయాల్లో కొంత మంది అవినీతి తిమింగళాలు.. మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు