Nalla Cheruvu inauguration: హైదరాబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని నల్లచెరువు పునరుద్ధరణ పనులను పూర్తి చేసి ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు అరికపూడి గాంధీ ఎంపీలు అధికారులు పాల్గొన్నారు. గతంలో ఈ ప్రాంత ఎంపీగా ఉన్నప్పుడు నిధుల కొరత వల్ల చేయలేకపోయిన అభివృద్ధిని ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో నూటికి నూరు శాతం పూర్తి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా గెలిచిన ప్రతినిధులు ఎవరైనా సరే మల్కాజగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు.
హైడ్రా చేపట్టిన ఆక్రమణల తొలగింపుపై వస్తున్న విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. చెరువుల పునరుద్ధరణ వల్ల భవిష్యత్తులో వరద ముప్పు తప్పుతుందని ఆయన పేర్కొన్నారు. చెరువులు నాలాలు ఆక్రమించడం వల్లే చిన్న వర్షానికే కాలనీలు మునిగిపోయి ప్రజల ఆస్తులు సర్టిఫికేట్లు నీళ్లపాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను నిజాంపేట వంటి ప్రాంతాల్లో నడుముల లోతు నీళ్లలో తిరిగి ప్రజల కష్టాలను చూశానని గుర్తు చేశారు. ఆక్రమణల తొలగింపులో నివాసాలు కోల్పోయిన అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.
నగరంలోని చెరువులను కేవలం నీటి వనరులుగానే కాకుండా ఆర్థిక కేంద్రాలుగా (Lake Economy) మార్చాలని ముఖ్యమంత్రి సూచించారు. చెరువుల గట్టున మహిళా స్వయం సహాయక సంఘాలకు షాపులు కేటాయించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాయంత్రం వేళ వాకింగ్కు వచ్చే ప్రజలకు పాలు కూరగాయలు నిత్యావసర వస్తువులు అక్కడే దొరికేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పిల్లలు రోడ్ల మీద ఆడుకుంటూ ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి చెరువు వద్ద ప్లే గ్రౌండ్లు స్కేటింగ్ కోర్టులు నిర్మించాలని ఆదేశించారు. కూకట్పల్లిలోని సున్న చెరువు పాత్సాగర్ తుమ్మిడికుంట వంటి చెరువులన్నింటినీ ఇదే తరహాలో పునరుద్ధరిస్తామని వెల్లడించారు.
ఢిల్లీలో కాలుష్యం బెంగళూరులో ట్రాఫిక్ ముంబైలో వరదలు వంటి సమస్యలు పాలకుల దూరదృష్టి లోపం వల్లే వచ్చాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్కు అలాంటి పరిస్థితి రాకూడదనే మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిపారు. అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ మాదిరిగానే మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరుతామన్నారు. దీనివల్ల ఎవరైనా ఇళ్లు కోల్పోతే వారికి నష్టపరిహారం అందిస్తామని లేదా ఇళ్లు కట్టించి ఇస్తామని భరోసా ఇచ్చారు. అభివృద్ధి పనులకు అందరూ సహకరించాలని అప్పు తెచ్చైనా సరే నగర ప్రక్షాళనకు నిధులు కేటాయిస్తానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
Read Also: పోలీసులు అప్గ్రేడ్ కావాలి.. కనిపించని నేరాలను ఎదుర్కోవడమే అతిపెద్ద సవాలు: సీఎం రేవంత్ రెడ్డి