నిజామాబాద్ పర్యటనలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో రాజకీయాలు కలుషితం అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి కొత్తగా వస్తున్న వారు ప్రజాసేవను విస్మరించి కేవలం ధనార్జనపైనే దృష్టి సారిస్తున్నారని విమర్శించారు. ఈ ధోరణి వల్ల వ్యవస్థ దెబ్బతింటోందని.. తక్షణమే రాజకీయాల ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
అవినీతి అంశంపై స్పందిస్తూ.. అన్ని రాజకీయ పార్టీల్లోనూ కొంతమంది అవినీతి నాయకులు ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు చేసే తప్పులను మొత్తం పార్టీకి ఆపాదించడం ఎంతమాత్రం సరికాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తప్పు చేసే నాయకులను ఎండగట్టడంలో మీడియా పాత్ర కీలకమని గుర్తుచేశారు. సమాజపు నాలుగో స్తంభమైన జర్నలిజం రాజకీయ నాయకుల లోటుపాట్లను ఎత్తిచూపే బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు.
మరోవైపు మావోయిస్టుల అంశంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులు ప్రజా జీవితంలో కలిసేందుకు ముందుకు రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ.. ఇది ఒక సోషల్ సెక్యులర్ పార్టీ అని కొనియాడారు. కేవలం ప్రజా సేవ చేయాలనే తపనతో వచ్చే వారందరినీ పార్టీ సాదరంగా ఆహ్వానిస్తుందని తెలిపారు.
ప్రతిపక్ష నేతలు హరీష్ రావు, కేటీఆర్ వైఖరిపై మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతి ప్రణాళికను చూసి ఓర్వలేక వారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు అత్యంత సంతృప్తిగా ఉన్నారని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ALSO READ: Kavuri Sambasiva Rao passed away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత!