DK Shivakumar: కర్ణాటక తదుపరి సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రజలకు డీకే శివకుమార్ సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రజా సంక్షేమానికి తాను పాటుపడతానన్న సందేశాన్ని వారికి అందించారు. మరోవైపు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లీకార్జున ఖర్గేతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై.. డీకేను అభినందించారు.
మరోవైపు మాజీ సీఎం సిద్దరామయ్య హయాంలో రాష్ట్ర హోమంత్రిగా పనిచేసిన జి. పరమేశ్వర.. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సిద్దరామయ్య సన్నిహితుడిగా పరమేశ్వరకు పేరుంది. ఈ నేపథ్యంలో ఆయనకు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించి.. సిద్దరామయ్య మద్దతుదారులకు ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం ఉంటుందన్న సందేశాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం ఇచ్చినట్లైంది. అటు సామాజికంగా చూస్తే.. వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలతో కూడిన అహింద ఓటర్లలో సిద్దరామయ్యకు అపారమైన పలుకుబడి ఉంది. పరమేశ్వర దళిత వర్గానికి చెందిన పాపులర్ లీడర్ కావడం కూడా ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దక్కడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.
డీకే శివకుమార్ అనే నేను..
కర్ణాటక నూతన సీఎంగా డీకే శివకుమార్ లోక్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ ఆయనతో ప్రమాణం చేయించారు. https://t.co/efPXUQF2Fm pic.twitter.com/69nxsPlqDv
— BIG TV Breaking News (@bigtvtelugu) June 3, 2026
సీఎం, డిప్యూటీ సీఎం తర్వాత .. కొత్త మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేశారు. కె.హెచ్. మునియప్ప, కె.జె. జార్జ్, ఎం.బి. పాటిల్, రామలింగ రెడ్డి, సతీశ్ జార్కి హోలి, కృష్ణ బైరే గౌడ, ప్రియాంక్ ఖర్గే, యు.టి. ఖాదర్, ఈశ్వర్ ఖండ్రే, యతీంద్ర (మాజీ సీఎం సిద్దరామయ్య కుమారుడు), భైరతి సురేశ్, డా. శరణ్ ప్రకాశ్ పాటిల్.. గవర్నర్ సమక్షంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.
డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, కేరళ సీఎం వీడీ సతీశన్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ పాల్గొన్నారు. నూతన సీఎం డీకేతో పాటు కొత్త కేబినేట్ కు వారు అభినందనలు తెలియజేశారు.
Also Read: రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్
2023లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగా అప్పటి సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య కాంగ్రెస్ అధినాయకత్వం ఓ ఒప్పందాన్ని కుదిర్చినట్లు వార్తలు వచ్చాయి. తొలి రెండున్నరేళ్లు సిద్దరామయ్య, తర్వాతి కాలం డీకే శివకుమార్ సీఎంగా ఉండేలా అంగీకారం కుదిరినట్లు ప్రచారం జరిగింది. ఇందుకు అనుగుణంగానే గతేడాది నుంచి డీకే శివకుమార్.. సీఎం పీఠం కోసం పట్టుబడుతూ వచ్చారు. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రక్రియకు కాస్త బ్రేక్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం.. తాజాగా డీకేకు కర్ణాటక సీఎంగా బాధ్యతలు అప్పగించడం గమనార్హం.
Also Read: ‘తెలంగాణ మా జాగీరే’.. పవన్ కళ్యాణ్పై గద్దర్ కూతురు వెన్నెల ఫైర్!