చంద్రబాబు రాజకీయ వ్యూహాలు ఎవరికీ అర్థం కావు. కేసీఆర్ కూడా అంతే. ఏ టైమ్లో ఏ నిర్ణయం తీసుకోవాలో నింపాదిగా రంగంలోకి దిగుతాడు. అందుకే ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు. మొన్నటి వరకు తమ రాజకీయాల్లో బిజీబిజీగా గడిపిన పవన్బాబు, చంద్రబాబులు.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై సీరియస్గా నజర్ పెట్టారు. దీనికి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్నే ముహూర్తంగా ఫిక్స్ చేసుకున్నారు. మరి చంద్రబాబు స్కెచ్ మామూలుగా ఉండదుగా. ఆయన వ్యూహాలకు తోడు.. ఆ ఎత్తుగడలకు పదును పెట్టే వ్యూహకర్తలు కూడా చాలా మందే ఉన్నారు తెలంగాణలో.
అందుకే ఇది ఓ పక్కా ప్లానింగ్గా జరుగుతూ వస్తోందంటున్నారు తెలంగాణవాదులు. పవన్ .. అదే రోజు మీటింగ్ కోసం కోర్టు మెట్లేక్కేదాకా పోవాల్సిన అవసరం లేదు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడాల్సిన సందర్భం అక్కడ లేనే లేదు. తెలంగాణలోకి ఎట్లా అడుగుపెడతావో చూస్తామంటున్నారు.. ఇదేమన్నా పాకిస్థానా..? పాస్పోర్టు తీసుకురావాలా? ఈ మాటలు అచ్చంగా రాజశేఖర్రెడ్డి నోటి వెంట వచ్చాయి ఆనాడు. ఇక్కడ తెలంగాణలో ఎన్నికలు ముగియగానే అక్కడ ఆంధ్రాలో వైఎస్సార్ రాజకీయ లబ్ది కోసం ఈ విధంగా రెచ్చగొట్టేలా మాట్లాడిన మాటలు ఇంకా గుర్తున్నాయి ప్రజలకు. అచ్చం అలాగే మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ కూడా. ఇవాళ దీనిపై చంద్రబాబు నాయుడు కూడా స్పందించాడు.
తెలంగాణలో అడుగు పెట్టనీయమని మాట్లాడటం ఏంటీ? ఇవేం రాజకీయాలు.. ప్రజాసేవలో పోటీ పడాలె గానీ.. తమిళనాడుకు నేను వెళ్లి ప్రచారం చేసి రాలేదా? అని ఆయన కూడా ఏవేవో మాట్లాడుతున్నాడు. వాస్తవానికి, వీరిద్దరి టార్గెట్ ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలే. ఇలా రెచ్చగొట్టడం ద్వారా ఉన్నపళంగా జనసేన పార్టీకి గానీ, టీడీపీకి గానీ తెలంగాణ వ్యాప్తంగా జరిగే లాభమేమీ లేదు. ఒక్క సెటిలర్లు ఉండే కొన్ని ప్రాంతాలు మినహా. ఆ ప్రాంతాల డివిజన్లనైనా కైవసం చేసుకోవడం ద్వారా హైదరాబాద్లో మొత్తంగా కోల్పోయిన తమ పట్టును నిలుపుకోవాలని వీరిద్దరూ భావిస్తున్నట్టుగా అనుకుంటున్నారు.
ఇక్కడ కాంగ్రెస్కు పట్టులేదు. అందుకే రేవంత్ సర్కార్ జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెంటనే పోవడం లేదు. దీంతో పాటు ఆయన మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం… అక్కడ మెల్లగా పార్టీని బలోపేతం చేయడం పై దృష్టి పెట్టాడు. కేంద్రం చేపడుతున్న జనగణన, సర్.. ఇవన్నీ ఎన్నికలకు ఆటంకాలే. అందుకే ఇవన్నీ పూర్తయిన తరువాతే .. జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోవాలనేది రేవంత్ ఉద్దేశం. అమీర్పేట్లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు కూడా అందులో భాగంగానే చూడాల్సి వస్తుంది.హైదరాబాద్ మొత్తంగా బీఆరెస్కు మంచి పట్టుంది. ఇది క్రమంగా ఇటు కాంగ్రెస్, అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి కైవసం చేసుకోవాలని చూస్తోంది. బీజేపీ ఎలాగూ ఒంటరిగానే పోటీ చేయాలనుకుంటున్నది.
ఆ పార్టీని కూడా హైదరాబాద్లో తక్కువ చేసి చూడలేం. గతంలో గణనీయమైన స్థానాలు కైవసం చేసుకున్నది. ఇప్పుడు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడం ద్వారా కొన్ని సీట్లైనా దక్కించుకుంటే..అది పరోక్షంగా బీజేపీకి మేలు జరగొచ్చనే ఓ భావనతో పాటు.. గ్రేటర్లో పార్టీ ఉనికిలోకి వస్తే.. సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నియోజకవర్గాల్లో కూడా పోటీ చేయవచ్చనే అభిప్రాయాలతో వారిద్దరూ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మూడు కార్పొరేషన్లను కాంగ్రెస్, బీజేపీలే హస్తగతం చేసుకోవాలనే చూస్తున్నాయి.. బీఆరెస్కు ఈసారి ఏమాత్రం చాన్స్ ఇవ్వకుండా.. హైదరాబాద్పై ఆ పార్టీ పూర్తిగా పట్టుకోల్పోయే విధంగా వ్యూహాత్మకంగా ఏపీ పాలిటిక్స్ ట్రిక్స్ ఇక్కడ ప్రయోగం చేస్తున్నారనిపిస్తుంది.
ఈ రచ్చ రాజకీయాలు మరింత పెరిగే అవకాశమే ఉంది తప్ప.. తగ్గేలా లేవు. జీహెచ్ఎంసీ ఎన్నికల లోపు సెటిలర్ల ఓట్లు లక్ష్యంగా మరిన్ని వ్యూహాలకు పదును పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.