Delhi Blast Update: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కీలక పురోగతి సాధించింది. ఈ దాడిలో 10 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, 32 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘోరమైన ఉగ్రదాడికి పాల్పడిన సూసైడ్ బాంబర్కు సహకరించిన, కుట్ర పన్నిన ఒక కాశ్మీరీ నివాసిని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ పేర్కొంది. నిందితుడిని అమీర్ రషీద్ అలీగా గుర్తించారు. ఢిల్లీ పోలీసుల నుంచి కేసు స్వీకరించిన ఎన్ఐఏ, భారీ గాలింపు చర్యల అనంతరం అమీర్ను ఢిల్లీలో అదుపులోకి తీసుకుంది.
నవంబర్ 10న దేశ రాజధానిని కుదిపేసిన ఈ పేలుడు వెనుక ఉన్న భారీ కుట్రను ఛేదించేందుకు ఎన్ఐఏ బృందాలతో దర్యాప్తును ముమ్మరం చేసింది. దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పేలుడుకు ఉపయోగించిన కారు అమీర్ రషీద్ అలీ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. జమ్మూ కాశ్మీర్లోని సంబూర, పాంపొర్కు చెందిన అమీర్.. సూసైడ్ బాంబర్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఉన్ నబీతో కలిసి ఈ దాడికి కుట్ర పన్నినట్లు తేలింది. వాహన ఆధారిత ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ పరికరం (VBIED)గా మార్చిన ఈ కారును కొనుగోలు చేయడంలో సహాయం చేయడానికే అమీర్ ఢిల్లీకి వచ్చినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
ఫోరెన్సిక్ ఆధారాల ద్వారా VBIED డ్రైవర్ (సూసైడ్ బాంబర్)ను పుల్వామా జిల్లాకు చెందిన ఉమర్ ఉన్ నబీగా ఎన్ఐఏ ఖచ్చితంగా గుర్తించింది. ఆశ్చర్యకరంగా, నబీ ఫరీదాబాద్లోని అల్ ఫలా యూనివర్సిటీలో జనరల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎన్ఐఏ అధికారులు నబీకి చెందిన మరో వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 73 మంది సాక్షులను (గాయపడిన వారితో సహా) విచారించారు.