Balakrishna: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకవైపు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం జిల్లాలో విస్తృతంగా పర్యటించి, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పెనుకొండ పర్యటనలో భాగంగా ఆయన మొదట సోమందేపల్లిలో మంత్రి సవిత ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత, హిందూపురం మున్సిపాలిటీ అభివృద్ధి పనుల కోసం మంజూరైన 92.5 కోట్ల రూపాయల నిధులకు సంబంధించిన పైలాన్ను ఆవిష్కరించి, నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సందేశమిచ్చారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బాలకృష్ణ మాట్లాడుతూ, నందమూరి కుటుంబంపై ప్రజలు చూపుతున్న ఆదరణను గుర్తుచేసుకున్నారు. “చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా అది ఒక్క నందమూరి కుటుంబానికే సాధ్యం” అని ఆయన అన్నారు. తన తండ్రి ఎన్టీఆర్, సోదరుడు హరికృష్ణతో పాటు, తనను కూడా మూడుసార్లు ఆశీర్వదించి గెలిపించిన హిందూపురం ప్రజలకు నందమూరి కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. హిందూపురం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో కొత్త పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతీ యువకులను ఆదుకోవడమే లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మంత్రులంతా ఇప్పుడు హిందూపురం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని, త్వరలోనే అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతాయని ఆయన హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ అభివృద్ధి కార్యక్రమాల్లో ఉండగానే, మరోవైపు హిందూపురం వైసీపీ ఇంచార్జ్ దీపిక అధికార టీడీపీ నాయకులకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. తమ పార్టీ కార్యాలయంపై ఇటీవల జరిగిన దాడిని ప్రస్తావిస్తూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారికి హెచ్చరికలు జారీ చేస్తూ, వారిపై న్యాయపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. “మేము ఇక్కడే ఉంటాం. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ఎవరు కాపాడుతారో చూస్తా. మేము అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని ఏ చంద్రబాబు, ఏ లోకేష్, ఏ బాలకృష్ణ కాపాడుతాడో నేను కూడా చూస్తా” అంటూ ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఒకే రోజు ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు ఘాటైన రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలతో హిందూపురం వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
Read Also: Andhra Pradesh: దారుణం.. ప్రేమ పేరుతో మోసం.. మైనర్ బాలికపై అత్యాచారం..