Special Intensive Revision: కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా అత్యంత కీలకమైన అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మూడవ విడత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహణకు రంగం సిద్ధం చేస్తూ రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు (CEOs) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 2026 నుంచి ఈ ప్రక్రియ క్షేత్రస్థాయిలో ప్రారంభం కానుంది.
అక్టోబర్ 2025లో ప్రకటించిన 12 రాష్ట్రాల SIR ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుండగా, మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభించాలని ఈసీ స్పష్టం చేసింది. ఈ మూడవ విడతలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ ఉన్నాయి. వీటితో పాటు చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ డయ్యూ, లడఖ్, ఢిల్లీ వంటి కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల అధికారులు కూడా ఈ ఆదేశాల పరిధిలోకి వస్తారు. బీహార్ మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎన్నికల సంఘం కోరింది.
ఏప్రిల్ 2026 నాటికి క్షేత్రస్థాయిలో ప్రక్రియ మొదలు కావాలంటే, దానికి ముందు చేపట్టాల్సిన సన్నాహక పనులను తక్షణమే పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. ఇందులో భాగంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, బీఎల్ఓల నియామకం, వారికి అవసరమైన శిక్షణ ఇవ్వడం, ఐటీ వ్యవస్థలను సిద్ధం చేయడం వంటి అంశాలు ఉంటాయి. గతంలో కంటే మరింత పారదర్శకంగా, సాంకేతికతను జోడించి ఈసారి ఓటర్ల నమోదును చేపట్టనున్నారు.
18 ఏళ్లు నిండిన యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాలో ఉండే డూప్లికేట్ ఓట్లు, తప్పుడు చిరునామాల వంటి సమస్యలకు పరిష్కారం లభించనుంది. ఓటర్ల జాబితాను పక్కాగా, దోషరహితంగా తీర్చిదిద్దడమే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రధాన లక్ష్యం. జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, మరణించిన లేదా శాశ్వతంగా వలస వెళ్ళిన వారి పేర్లను తొలగించడం వంటి పనులను ఈ సమయంలో యుద్ధ ప్రాతిపదికన చేపడతారు.
Read Also: Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగరా.. కాంగ్రెస్ నుంచి రేసులో ఉన్నదెవరు?