దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 8 కోట్ల మంది ఈపీఎఫ్వో ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు తీసుకునే ప్రక్రియను ఇప్పుడు మరింత సులభతరం చేసింది. యూపీఐ (UPI) ద్వారా నేరుగా నగదు బదిలీ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఈ సేవలు ప్రారంభం కానున్నాయని కార్మిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేయాలంటే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా క్లెయిమ్ ఫారమ్లు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయి నగదు చేతికి రావడానికి కొంత సమయం పడుతోంది. అయితే, కొత్త విధానం అమల్లోకి వస్తే, సభ్యులు తమ ఈపీఎఫ్ ఖాతాకు లింక్ అయిన బ్యాంకు ఖాతా ద్వారా, యూపీఐ పిన్ ఉపయోగించి అతి తక్కువ సమయంలోనే నగదును బదిలీ చేసుకోవచ్చు. ఈ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఈపీఎఫ్వో ప్రస్తుతం తన సాఫ్ట్వేర్లో అవసరమైన సాంకేతిక మార్పులు చేస్తోంది.
ఇప్పటికే అమల్లో ఉన్న ఆటో-సెటిల్మెంట్ విధానం ద్వారా అనారోగ్యం, వివాహం, విద్య, గృహ నిర్మాణం వంటి అత్యవసరాల కోసం చేసే క్లెయిమ్లను కేవలం మూడు రోజుల్లోనే పరిష్కరిస్తున్నారు. గతంలో ఈ ఆటో-క్లెయిమ్ పరిమితి రూ.1 లక్షగా ఉండగా, దానిని ఇప్పుడు రూ.5 లక్షలకు పెంచారు. దీనివల్ల మధ్యతరగతి ఉద్యోగులకు అత్యవసర సమయాల్లో ఆర్థిక వెసులుబాటు లభించనుంది.
ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, పాక్షిక ఉపసంహరణ నిబంధనలను కూడా ప్రభుత్వం సరళీకరించింది. గతంలో ఉన్న 13 సంక్లిష్టమైన నియమాలను తొలగించి, వాటిని కేవలం మూడు సాధారణ కేటగిరీలుగా మార్చింది. దీనివల్ల క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశాలు తగ్గుతాయి. కొత్త నిబంధనల ప్రకారం.. సభ్యులు తమ ఖాతాలోని అర్హత ఉన్న బ్యాలెన్స్లో 100 శాతం వరకు విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే.. ఒక ముఖ్య గమనిక ఏమిటంటే.. ఈపీఎఫ్ అందించే 8.25 శాతం చక్రవడ్డీ ప్రయోజనాన్ని పూర్తిగా కోల్పోకుండా ఉండాలంటే, సభ్యులు తమ ఖాతాలో కనీసం 25 శాతం నిల్వను కొనసాగించడం ఉత్తమం.
ఏటా ఈపీఎఫ్వోకు సుమారు 5 కోట్లకు పైగా క్లెయిమ్లు వస్తుంటాయి. యూపీఐ ఆధారిత సేవలు అందుబాటులోకి వస్తే, క్లెయిమ్ ప్రాసెసింగ్ భారం గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మార్పులతో ఈపీఎఫ్వో సేవలు ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థకు దీటుగా మారనున్నాయి. డిజిటల్ చెల్లింపుల దిశగా ఇది ఒక మైలురాయిగా నిలవనుంది.