Deepika Adhana pilot: ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ప్రాణాలకు తెగించి సామాన్య భారతీయులను రక్షించిందో వీరనారి. ఫరీదాబాద్కు చెందిన 23 ఏళ్ల దీపికా అదానా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పైలట్గా ఒక క్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్లో పాలుపంచుకున్నారు. మార్చి 6వ తేదీ ఉదయం 10:15 గంటలకు ఆమెకు ఆదేశాలు వచ్చాయి. వాస్తవానికి ఆమె స్నేహితురాలు ఈ విమానాన్ని నడపాల్సి ఉండగా.. ప్రయాణానికి కేవలం రెండు గంటల ముందు దీపికాను విధులకు హాజరుకావాలని కోరారు. యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రాంతానికి వెళ్తున్నానని తెలిసిన దీపికా.. తన కుటుంబానికి వీడ్కోలు చెబుతూ “అమ్మా బై.. నేను మళ్ళీ తిరిగి వస్తానో లేదో తెలియదు” అని అన్న మాటలు ఆ సమయాన ఉన్న తీవ్రతను తెలియజేస్తున్నాయి.
కెప్టెన్ జస్విందర్ కౌర్ నాయకత్వంలోని ఈ సర్వ మహిళా సిబ్బంది బృందం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని రాస్ అల్ ఖైమా విమానాశ్రయానికి బయలుదేరింది. యుద్ధ భయం ఉన్నప్పటికీ సిబ్బందికి తగిన భద్రతా చర్యలపై భరోసా ఇవ్వడంతో వారు అత్యంత వృత్తిపరంగా వ్యవహరించారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో విమానం యూఏఈలో ల్యాండ్ అయింది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ విమానాశ్రయం యుద్ధం వల్ల నిర్మానుష్యంగా కనిపించినా.. సిబ్బంది ఏమాత్రం తొట్రుపడలేదు. కేవలం గంట వ్యవధిలోనే 169 మంది భారతీయులను విమానం ఎక్కించుకుని సాయంత్రం 3:30 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు.
తిరుగు ప్రయాణంలో ఒకానొక దశలో విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) తో సంబంధాలు తెగిపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నెట్వర్క్ వైఫల్యం వల్ల తలెత్తిన ఈ సమస్యను పైలట్లు చాకచక్యంగా అధిగమించి కొద్దిసేపటికే తిరిగి కమ్యూనికేషన్ పునరుద్ధరించారు. చివరికి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. తమను ప్రాణాలతో స్వదేశం చేర్చినందుకు ప్రయాణికులు సిబ్బందికి కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు. తన కుమార్తె క్షేమంగా తిరిగి రావడమే కాకుండా వందలాది మందిని రక్షించినందుకు దీపికా తల్లి బాబ్లీ అదానా ఆనందం వ్యక్తం చేశారు.
దీపికా అదానా పైలట్ కావాలనేది ఆమె తాత అమృత్ సింగ్ అదానా కల. 2020లో ప్లస్ టూ పూర్తి చేసిన దీపికా.. కోవిడ్ కష్టకాలంలో కూడా పట్టుదలతో చదివి కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL) సాధించారు. గ్రీస్, ఇస్తాంబుల్లో ఎయిర్బస్ ఏ320 విమానాలపై శిక్షణ పొందిన ఆమె.. 2024లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో చేరారు. కేవలం 23 ఏళ్ల వయసులోనే ఇంతటి సాహసోపేతమైన మిషన్ను విజయవంతం చేసి దీపికా నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. ఫరీదాబాద్లోని ఆమె నివాసం వద్ద ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది.
Read Also: Iran Attack: భారత్కు వస్తున్న కార్గో షిప్పై ఇరాన్ అటాక్.. స్పాట్లో 20 మంది సిబ్బంది..?