Tirumala Leopard: కలియుగ వైకుంఠం తిరుమల గిరులలో మరోసారి వన్యమృగాల సంచారం కలకలం రేపింది. శ్రీవారిని దర్శించుకునేందుకు ఎంతో భక్తిశ్రద్ధలతో అలిపిరి నడక మార్గం ద్వారా వెళ్తున్న భక్తులకు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. అలిపిరి కాలినడక దారిలోని ప్రసిద్ధ లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో ఒక్కసారిగా చిరుతపులి ప్రత్యక్షం కావడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చిరుతను చూసిన వెంటనే ప్రాణభయంతో భక్తులు చెల్లాచెదురుగా పరుగులు తీశారు. ఈ హఠాత్పరిణామంతో ఆ ప్రాంతంలో కాసేపు తీవ్ర ఉత్కంఠ, గందరగోళ పరిస్థితి నెలకొంది.
అప్రమత్తమైన అటవీశాఖ.. రంగంలోకి సిబ్బంది!
భక్తుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే టీటీడీ భద్రతా సిబ్బందితో పాటు అటవీశాఖ అధికారులు వేగంగా స్పందించారు. చిరుత సంచరించిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది.. భక్తులకు ఎటువంటి హాని కలగకుండా అప్రమత్తం చేశారు. చేతుల్లోని ఇనుప రాడ్లతో పెద్ద పెట్టున శబ్దాలు చేస్తూ, కేకలు వేస్తూ చిరుతను సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి విజయవంతంగా తరిమికొట్టారు. దీంతో భక్తులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ఒంటరిగా వెళ్లొద్దు.. గుంపులుగానే నడవండి!
ఈ ఘటన నేపథ్యంలో అటవీశాఖ అధికారులు, టీటీడీ యంత్రాంగం కాలినడకన వెళ్లే భక్తులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. కొండపైకి వెళ్లే భక్తులు ఎవరూ కూడా నడక మార్గంలో ఒంటరిగా ప్రయాణించవద్దని, కనీసం 10 నుండి 15 మంది గ్రూపులుగా కలిసి నడవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చిన్న పిల్లలతో వచ్చే తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని, పిల్లలను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని హెచ్చరించారు.
భక్తుల భద్రతకు ప్రత్యేక నిఘా
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రక్షణే తమకు ప్రథమ ప్రాధాన్యమని అధికారులు స్పష్టం చేశారు. చిరుత సంచరించిన లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచినట్లు తెలిపారు. నడక దారి పొడవునా ఉండే సీసీ కెమెరాల ద్వారా వన్యమృగాల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, భక్తులు ఎలాంటి ఆందోళన చెందకుండా, అధికారుల సూచనలు పాటిస్తూ భక్తిభావంతో సురక్షితంగా తిరుమల యాత్రను పూర్తి చేసుకోవచ్చని టీటీడీ పేర్కొంది.
Also Read: ఉదయం నిరసన సెగ.. సాయంత్రానికే దిగొచ్చిన హైడ్రా.. బస్తీవాసుల ఆందోళనలకు కమిషనర్ రంగనాథ్ క్లారిటీ
తిరుమల నడక మార్గంలో చిరుత కలకలం
తిరుమల అలిపిరి నడక మార్గంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో నిన్న రాత్రి చిరుతపులి సంచరించడం భక్తులలో తీవ్ర భయాందోళనలు సృష్టించింది. చిరుతను చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. వెంటనే స్పందించిన అటవీశాఖ సిబ్బంది రాడ్లతో పెద్ద పెట్టున శబ్దాలు… pic.twitter.com/d80OjkgI2B
— BIG TV Breaking News (@bigtvtelugu) July 11, 2026