Supreme Court: విద్యుత్ బకాయిల వివాదంలో గీతం వర్సిటీకి (Supreme Court) సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. నాలుగు వారాల్లోపు బకాయి ఉన్న మొత్తంలో రూ. 15కోట్ల రూపాయలను డిపాజిట్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో వీబీసీ ఫెర్రో అలాయ్స్ సంస్థతో గీత వర్సిటీకి ఉన్న సంబంధాలపై తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును ఆదేశించింది. గీతం వర్సిటీ కోట్లాది రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించక పోవటంతో విద్యుత్ శాఖ అధికారులు కొంతకాలం క్రితం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. బాకీ చెల్లించక పోతే విద్యుత్ కనెక్షన్లను తొలగిస్తామని అధికారులు నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
దాంతో గీతం వర్సిటీ వర్గాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇటీవల నాలుగు వారాల్లోపు రూ. 54 కోట్ల రూపాయలను చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ గీతం వర్సిటీ వర్గాలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఇరుపక్షాల వాదనలు వింది. గీతం వర్సిటీ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది వీబీసీ ఫెర్రో అలాయ్స్ సంస్థ చెల్లించాల్సిన బకాయిలను గీతం వర్సిటీపై మోపటం చట్ట విరుద్దమని చెప్పారు. వీబీసీ సంస్థ నుంచి భూములు కొనుగోలు చేసినంత మాత్రాన ఆ సంస్థ అప్పులు గీతం వర్సిటీకి వర్తించవని తెలిపారు.
దీనిపై టీఎస్ఎస్పీడీసీఎల్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ వీబీసీ సంస్థర, గీతం వర్సిటీ మధ్య జరిగిన లావాదేవీలు, ఆస్తుల బదిలీ అంశాలను పరిశీలిస్తే రెండు పరస్పర సంబంధిత సంస్థలే అని వెల్లడైందని చెప్పారు. వీబీసీ కంపెనీ చెల్లించాల్సిన 118 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలను చెల్లించాలంటూ అందుకే గీతం వర్సిటీకి నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం సుప్రీం కోర్టు వీబీసీ సంస్థకు గీతం వర్సిటీతో ఉన్న సంబంధంపై సవివరంగా పరిశీలన జరిపి తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. అప్పటివరకు మధ్యంతర చర్యగా నాలుగు వారాల్లో 15 కోట్ల రూపాయలను డిపాజిట్ చేయాలని గీతం వర్సిటీకి ఆదేశాలు జారీ చేసింది.