Damodar Raja Narasimha: జోగిపేటలో డాక్టర్ల పనితీరుపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Raja Narasimha) ఆగ్రహం వ్యక్తం చేసారు. జోగిపేటలోని ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఆసుపత్రిలోని వార్డుల్లోకి వెళ్లి స్వయంగా రోగులను ఆసుపత్రిలోని సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు విధులకు సరిగ్గా రావడంలేదని తెలుసుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆసుపత్రి నుంచే రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్కు ఫోన్ చేసారు. జోగిపేట ఆసుపత్రి పరిస్థితి ఇంతేనా ఇక మారదా అంటూ ఈ రోజు విధులకు హజరుకాని డాక్టర్లను సస్పెండ్ చేయాలని మంత్రి ఆదేశించారు. మంత్రి స్వయంగా సిబ్బంది హజరు రిజిష్టర్ను పరిశీలించారు.
Also ReadHyderabad Drugs: హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం.. ఈగల్ టీమ్ మెరుపు దాడి, టెక్నాలజీతో డ్రగ్స్ దందా!
ప్రస్తుతం అసుపత్రిలో ఎంత మంది ఉన్నారు..?వారంతా ఎక్కడ అంటూ విధుల్లో ఉన్న డాక్టర్ సతీష్ గౌడ్ ప్రశ్నించారు. అసుపత్రి సూపరిండెంట్ సెలవుల్లో ఉన్నారని చెప్పగా, వంద పడకల అసుపత్రిలో డాక్టర్ ఒక్కరే ఉంటారా? అసుపత్రిలోని అవుట్, ఇన్ పెషంట్ల వివరాలు, రక్త పరీక్షలు, ఇతరత్రా సేవలపై ఆరా తీశారు. అసుపత్రిలో మందుల కొరత ఏమైనా ఉందా ఇంకా ఏమైనా సమస్యలున్నాయా అంటూ డాక్టర్ను అడగగా, అలాంటిదేమి లేదంటూ ఆయన బదులిచ్చారు.
జోగిపేట ప్రభుత్వాసుపత్రికి ఎవ్వరికి సమాచారం ఇవ్వకుండా మంత్రి రావడంతో ఆసుపత్రి సిబ్బంది అవాక్కయ్యారు. మంత్రి 20 నిమిషాల పాటు ఆసుపత్రిలోని వార్డులను తిరుగుతూ సౌకర్యాలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని సిబ్బంది విధి నిర్వాహణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డీసీహెచ్ఎస్కు ఫోన్ చేసి మంత్రి ఆదేశించారు. మంత్రి ఉన్నంత సేపు సిబ్బంది డ్యూటీ డాక్టర్తో సహ టెన్షన్ టెన్షన్తో ఉన్నారు.
Also Read: Muduchintalapalli Municipality: మూడుచింతల పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఘన విజయం