Goa Fire Accident: గోవా పర్యాటక రంగాన్ని కుదిపేసిన అర్పోరా అగ్నిప్రమాదం విషాదకరంగా మారింది. ఉత్తర గోవాలోని అర్పోరాలో ఉన్న ప్రసిద్ధ రెస్టారెంట్–కమ్–నైట్ క్లబ్లో సిలిండర్ పేలి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్పందిస్తూ, ఈ ప్రమాదం గోవా చరిత్రలో అరుదైన విషాదమని పేర్కొన్నారు.
అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే, అర్ధరాత్రి 1.30 గంటలకు ఆయన స్వయంగా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబో, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. మంటలు చెలరేగిన కొద్దిసేపటికే అగ్నిమాపక సిబ్బంది భారీగా చేరి సుమారు అరగంటలో వాటిని అదుపులోకి తెచ్చారు. అయితే మంటలు వేగంగా విస్తరించడంతో.. లోపలి భాగం పూర్తిగా మూసివుండటం కారణంగా పలువురు బయటకు రాలేకపోయారు. దీంతో చాలా మంది పొగతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
మృతులలో నలుగురు పర్యాటకులు ఉన్నారు. మిగతావారు అక్కడ పనిచేసే సిబ్బందే. ముఖ్యమంత్రి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు తగిన పరిహారం ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు.
అగ్నిప్రమాదంలో గాయపడిన ఆరుగురిని గోవా మెడికల్ కాలేజీకి తరలించగా, వారికి ఉత్తమ వైద్య సేవలు అందుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ విషయంపై కాలేజీ డీన్తో కూడా ఆయన చర్చించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేస్తోందని చెప్పారు.
ఈ ఘోర ప్రమాదం ఎలా జరిగింది? ఏ నిబంధనలు ఉల్లంఘించబడ్డాయి? అనుమతులు ఎలా ఇచ్చారు? అనేవ్యవస్థలను శాసించడానికి ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మెజిస్టీరియల్ ఇన్క్వైరీకి ఆదేశాలు జారీ చేశారు. క్లబ్కు ఉన్న అనుమతులు చట్టబద్ధమా? అగ్ని భద్రతా ప్రమాణాలు పాటించబడ్డాయా? భవన నిర్మాణ నిబంధనలు అమలయ్యాయా? అన్నింటినీ సవివరంగా పరిశీలిస్తామని తెలిపారు.
ఈ నేపథ్యంలో క్లబ్ యజమానులపై ఇప్పటికే అరెస్ట్ వారెంట్ జారీచేసింది ప్రభుత్వం. నిర్వాహకులు, బాధ్యులైన పలువురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. దోషిగా తేలితే ఎవ్వరినీ వదలము, కఠిన చర్యలు తప్పవు అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఉదయం ముఖ్యమంత్రి సావంత్కు ఫోన్ చేసి, ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారి వివరాలు, చికిత్స పరిస్థితులు, చేపట్టిన చర్యలు వంటి అంశాలపై వివరాలు అడిగినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఈ ఘటన గోవా వంటి పర్యాటక రాష్ట్రానికి పెద్ద దెబ్బ అని అభిప్రాయపడిన సీఎం ప్రమోద్ సావంత్, భవిష్యత్తులో రాష్ట్రంలోని నైట్ క్లబ్లు, రెస్టారెంట్లు, పబ్లపై కఠిన భద్రతా ఆడిట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. భద్రతా పరికరాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, భవన నిర్మాణ ప్రమాణాలు తప్పనిసరి కాబడతాయని, ఎవరికైనా అందులో లోపం ఉంటే వెంటనే చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.