Goa fire Accident: గోవాలోని అర్పొరాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మృతుల్లో ముగ్గురు మహిళలు, 20 మంది పురుషులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.
ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ ప్రమాదంలో ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్కరి బంధువులకు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి(PMNRF)నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్ గ్రేషియను ప్రధాని ప్రకటించారు.
గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఈ ఘటనను రాష్ట్ర చరిత్రలో అత్యంత దుర్ఘటనలలో ఒకటిగా పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గోవా వంటి పర్యాటక రాష్ట్రానికి ఇలాంటి సంఘటన చోటుచేయడం చాలా దురదృష్టకరం. భద్రతా ప్రమాణాలు పాటించకుండా చట్టవిరుద్ధంగా ఇలాంటి సంస్థలను నడిపించడం ప్రమాదానికి కారణం. ప్రస్తుతం 23 ప్రాణాలు కోల్పోయారు. ఇది రాష్ట్రానికి పెద్ద నష్టం. ఈ ఘటనపై ప్రభుత్వం స్పెషల్ కమిటీతో విచారణ చేపడుతోంది. అగ్నిప్రమాదానికి నిజమైన కారణాలు ఏవో అధికారులు పరిశీలిస్తున్నారు. బాధ్యులపై అత్యంత కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.
ఈ ఘటనపై ఎమ్మెల్యే మైఖేల్ లోబో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని గోవా బిజెపి ఎమ్మెల్యే మైఖేల్లోబో తెలిపారు. ఈ సంఘటన నన్ను తీవ్రంగా కలవరపెట్టింది. ముగ్గురు మహిళలు, 20 మంది పురుషులు సహా 23 మంది మరణించడం గోవాకు పెద్ద నష్టం. ఈ మృతులలో కొందరు పర్యాటకులు, ఎక్కువ మంది బేస్మెంట్ రెస్టారెంట్లో పనిచేస్తున్న స్థానికులు. సరైన ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం ప్రాణాలను బలిగొంది. ఇప్పుడైనా గోవాలోని ఇతర క్లబ్లు, రెస్టారెంట్లు, పబ్లపై పూర్తి స్థాయి భద్రతా ఆడిట్ తప్పనిసరి అని తెలిపారు.
Also Read: గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. 23 మంది స్పాట్ డెడ్
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ఉత్తర గోవా జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో విలువైన ప్రాణాలను కోల్పోయినందుకు తీవ్ర బాధ కలిగింది. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి. ఈ క్లిష్ట సమయంలో వారు బలాన్ని పొందాలని కోరుకుంటున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని అన్నారు.