Hardeep Singh Puri Daughter: జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో గతంలో వెల్లడైన కోర్టు పత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు రాజకీయ ప్రముఖులు.. పారిశ్రామికవేత్తల పేర్లు బయటకు వచ్చాయి. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు ఫోటోలను మార్ఫింగ్ చేయడం లేదా తప్పుడు పేర్లతో కూడిన జాబితాలను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ తప్పుడు సమాచారం వల్ల తన వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన గౌరవానికి విఘాతం కలుగుతోందని కేంద్ర మంత్రి కుమార్తె ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ కుమార్తె తనపై ఆన్లైన్ వేదికల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా న్యాయపోరాటానికి దిగారు. తన పేరును ఈ వివాదంతో ముడిపెడుతూ కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఎప్స్టీన్ జాబితాలో తన పేరు ఉందంటూ జరుగుతున్న ప్రచారం పచ్చి అబద్ధమని.. దీని వెనుక తన తండ్రి రాజకీయ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర ఉండవచ్చని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
తన తండ్రి కేంద్ర మంత్రిగా ఉన్నందున కావాలనే తనను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆమె కోర్టుకు విన్నవించారు. గతంలో తన తండ్రి ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారిగా పనిచేసిన విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. తన పేరును ఈ వివాదంతో ముడిపెడుతూ వస్తున్న పోస్టులను తక్షణమే తొలగించాలని ఆమె కోరారు.
ఈ అంశంపై బాధ్యులైన వ్యక్తులు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. భవిష్యత్తులో ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రచురించకుండా లేదా షేర్ చేయకుండా వారిని నియంత్రించాలని అలాగే జరిగిన నష్టానికి పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు.
Read Also: KTR : కేటీఆర్ నిజంగానే డ్రగ్స్ టెస్టు చేయించుకుంటారా?