Hathras godman reacts to stampede: ఉత్తర్ప్రదేశ్లోని హథ్రాస్లో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కలచి వేసింది. అయితే ఈ తొక్కిసలాట జరిగిన 24 గంటల తర్వాత గాడ్ మ్యాన్ భోలే బాబా స్పందించాడు. తాను ఆ వేదిక నుంచి వెళ్లిపోయిన తర్వాత ప్రమాదం చోటుచేసుకుందన్నాడు. ఇంతటితో ఆగకుండా ఈ ఘటన వెనుక కొన్ని అసాంఘిక శక్తులు ఉన్నాయని ఆరోపించాడు.
కాగా ఈ తొక్కిసలాటలో మరణించిన వారికి భోలే బాబా సంతాపం తెలియజేశాడు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అని పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ ప్రాథమిక విచారణ చేపట్టారు. భోలే బాబా సెక్యూరిటీ సిబ్బంది భక్తులను నెట్టివేయడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిపారు.
సత్సంగ్ పండల్లో 2 లక్షల మందికి పైగా జనం హాజరయ్యారని సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ నివేదికలో పేర్కొన్నారు. శ్రీ నారాయణ్ సాకర్ హరి (భోలే బాబా) మధ్యాహ్నం 12.30 గంటలకు సత్సంగ్ పండల్కు చేరుకున్నారని.. ఈ కార్యక్రమం ఒక గంట పాటు కొనసాగిందని తెలిపారు.
Also Read: హాథ్రస్ ఘటనలో గంట గంటకు పెరుగుతున్న మృతులు.. 121కి చేరిన సంఖ్య
మధ్యాహ్నం 1.40 గంటలకు, శ్రీ నారాయణ్ సకార్ హరి (భోలే బాబా) జాతీయ రహదారి-91లో ఎటాహ్ వైపు వెళ్ళడానికి పండల్ నుంచి బయటికి వచ్చాడని తెలిపారు. భోలే బాబా పాద ధూళికోసం జనం ఒక్కసారిగా ఎగబడ్డారని పేర్కొన్నారు. దీంతో బాబా సెక్యూరిటీ సిబ్బంది నెట్టివేశారని ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు.