Bangladeshi tourists Ban: పశ్చిమ బెంగాల్లోని కీలక పర్యాటక ప్రాంతమైన సిలిగురి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బంగ్లాదేశ్లో జరుగుతున్న అశాంతి, భారత వ్యతిరేక చర్యలకు నిరసనగా ఇక్కడి హోటల్ యజమానుల అసోసియేషన్ కఠిన నిర్ణయం తీసుకుంది. వ్యాపారం కంటే దేశ గౌరవమే ముఖ్యమని చాటిచెబుతూ బంగ్లాదేశ్ పౌరులకు గదులు ఇవ్వకూడదని అసోసియేషన్ నిర్ణయించింది.
ఎందుకు ఈ కఠిన నిర్ణయం?
గత కొంతకాలంగా బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. అక్కడి మైనారిటీలపై (ముఖ్యంగా హిందువులపై) దాడులు పెరగుతున్నాయి. అంతే కాకుండా
జాతీయ జెండాను అవమానించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.బంగ్లాలో భారత్ వ్యతిరేక నినాదాలు మిన్నంటుంతున్నాయి. ఈ పరిణామాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సిలిగురి హోటల్ అసోసియేషన్ “Our Country Comes First” (మన దేశమే మనకు ముఖ్యం) అనే నినాదంతో ఈ నిషేధాన్ని అమలు చేస్తోంది.
మెడికల్ వీసా ఉన్నా సరే.. నో ఎంట్రీ:
సాధారణంగా పర్యాటక వీసాలపై ఆంక్షలు ఉండటం చూస్తుంటాం. కానీ.. సిలిగురి హోటల్ యజమానులు ఒకడుగు ముందుకేసి.. మెడికల్ వీసాతో వచ్చే వారికి కూడా హోటల్ రూమ్స్ ఇవ్వమని స్పష్టం చేశారు. సిలిగురి అనేది ఈశాన్య భారత్కు ప్రధాన కేంద్రం కాబట్టి.. బంగ్లాదేశ్ నుంచి వేలాది మంది చికిత్స కోసం ఇక్కడికి వస్తుంటారు. తాజా నిర్ణయంతో రోగులకు కూడా ఇబ్బందులు తప్పేలా లేవు.
దీని ప్రభావం ఎలా ఉండబోతోంది ?
ఈ నిర్ణయం వల్ల పర్యాటక రంగంపై కొన్ని ప్రభావాలు పడే అవకాశం ఉంది.
ఆర్థికంగా దెబ్బ: సిలిగురి హోటళ్లు, మార్కెట్లు బంగ్లాదేశ్ పర్యాటకులపై చాలా వరకు ఆధారపడి ఉంటాయి. ఈ నిషేధం వల్ల ఆదాయం తగ్గే ఛాన్స్ ఉంది.
వైద్య సేవలకు ఆటంకం: హోటళ్లలో రూమ్స్ దొరకకపోతే.. చికిత్స కోసం వచ్చే సామాన్య రోగులు తీవ్ర ఇబ్బందులు పడతారు.
భద్రతా చర్యలు: ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండటానికి ఇదొక ముందస్తు జాగ్రత్త అని యాజమాన్యాలు అంటున్నాయి.
సిలిగురి, ఉత్తర బెంగాల్ ఆర్థిక వ్యవస్థలో బంగ్లాదేశ్ టూరిస్టులు కీలక పాత్ర పోషిస్తారు. హోటళ్లు, రవాణా, స్థానిక మార్కెట్లు వీరిపై ఆధారపడి ఉంటాయి. ఈ నిషేధం వల్ల.. ఇలాంటి స్థానిక నిర్ణయాలు ప్రజల మధ్య ఉన్న సంబంధాలపై ప్రభావం చూపుతాయి.
Also Read: ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు: 200 విమానాలు ఆలస్యం.. ప్రయాణికులకు ఎయిర్లైన్స్ కీలక సూచనలు
హోటల్ అసోసియేషన్ వాదన:
దేశభక్తి: “వ్యాపారం కంటే దేశ గౌరవం ముఖ్యం” అనేది వారి ప్రధాన వాదన.
భద్రత: ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా దీనిని భావిస్తున్నారు.
నిరసన: పొరుగు దేశంలో భారతీయులకు, భారత ప్రతీకలకు జరుగుతున్న అవమానానికి ఇది ఒక శాంతియుత నిరసన అని వారు పేర్కొన్నారు.
“మా దేశాన్ని గౌరవించని వారికి మా దగ్గర చోటు లేదు” అన్నది సిలిగురి హోటల్ యజమానుల గట్టి వాదన. దేశ భక్తితో తీసుకున్న ఈ నిర్ణయానికి సోషల్ మీడియాలో భారీ మద్దతు లభిస్తుండగా.. మానవతా దృక్పథంతో రోగులకు మినహాయింపు ఇవ్వాలనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పరిస్థితులు చక్కబడే వరకు ఈ నిషేధం కొనసాగేలా కనిపిస్తోంది.